Cooking Oil Price| గత కొంతకాలంగా కొండెక్కి కూర్చున్న వంటనూనె ధరలు త్వరలోనే దిగిరానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే వంట నూనె దిగుమతిపై సుంకాలను తగ్గించాలని నిర్ణయించింది. ముఖ్యంగా క్రూడ్ పామాయిల్, క్రూడ్ సోయాబీన్ ఆయిల్, క్రూడ్ సూర్యకాంతి నూనెలపై ప్రాథమిక సుంకాన్ని 20 శాతం నుండి 10 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయం వంట నూనెల ధరలను తగ్గించడానికి, దేశీయ నూనె శుద్ధి పరిశ్రమల మనుగడను కాపాడటానికి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సుంకాల తగ్గింపు వెంటనే అమలులోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
దేశంలో వంట నూనె అవసరాల కోసం 50 శాతం కంటే ఎక్కువ దిగుమతల మీదే ఆధారపడాల్సి వస్తోంది. 2023-24 మార్కెటింగ్ సంవత్సరంలో (నవంబర్ నుండి అక్టోబర్ వరకు) దేశం 159.6 లక్షల టన్నుల వంట నూనెలను దిగుమతి చేసుకుంది. దీని విలువ రూ. 1.32 లక్షల కోట్లు. ఈ నూనెలపై సుంకం తగ్గించడం వల్ల దేశీయంగా నూనె ధరలు తగ్గుతాయని, వినియోగదారులకు లాభం చేకూరుతుందని కేంద్ర ఆహార కార్యదర్శి సంజీవ్ చోప్రా తెలిపారు.
సాల్వెంట్ ఎక్స్ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (SEA) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.వి. మెహతా మాట్లాడుతూ.. క్రూడ్ పామాయిల్, క్రూడ్ సోయాబీన్ ఆయిల్, క్రూడ్ సన్ ఫ్లవర్ ఆయిల్ పై ప్రాథమిక సుంకం 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గినట్లు చెప్పారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఈ నూనెలపై మొత్తం సుంకం (ప్రాథమిక సుంకం ఇతర ఛార్జీలతో కలిపి) 27.5 శాతం నుంచి 16.5 శాతానికి తగ్గుతుంది. అయితే, శుద్ధి చేసిన నూనెలపై మాత్రం ప్రాథమిక సుంకం 32.5 శాతంగా అలాగే ఉంది, దీనిపై మొత్తం సుంకం 35.75 శాతంగా ఉంది.
ఎస్ఈఏ, ఇండియన్ వెజిటబుల్ ఆయిల్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (IVPA) ఈ నిర్ణయాన్ని స్వాగతించాయి. క్రూడ్, శుద్ధి చేసిన నూనెల మధ్య సుంకం తేడాను పెంచాలని ఈ సంస్థలు గతంలో డిమాండ్ చేశాయి. ఈ తేడా 8.25 శాతం నుండి 19.25 శాతానికి పెరిగిందని ఎస్ఈఏ అధ్యక్షుడు సంజీవ్ అస్థానా తెలిపారు. ఈ నిర్ణయం శుద్ధి చేసిన పామాయిల్ దిగుమతులను తగ్గించి.. క్రూడ్ పామాయిల్ డిమాండ్ను పెంచుతుందని, దీని వల్ల దేశీయ నూనె శుద్ధి పరిశ్రమలు బలోపేతం అవుతాయని ఆయన అన్నారు.
ఈ సుంకం తగ్గింపు వల్ల దేశీయంగా వంట నూనెల ధరలు తగ్గుతాయని, వినియోగదారులకు ఊరట కలుగుతుందని మెహతా చెప్పారు. ఇటీవల శుద్ధి చేసిన పామాయిల్ దిగుమతులు పెరిగాయని, ఎందుకంటే అవి క్రూడ్ పామాయిల్ కంటే చౌకగా ఉన్నాయని ఆయన వివరించారు. భారతదేశం పామాయిల్ను మలేషియా, ఇండోనేషియా నుంచి.. సోయాబీన్ ఆయిల్ను బ్రెజిల్, అర్జెంటీనా నుంచి దిగుమతి చేసుకుంటోంది.
Also Read: సిగరెట్తో పాటు టీ తాగుతున్నారా?.. ఆరోగ్యానికి చాలా హానికరం జాగ్రత్త.. ఎందుకంటే?
ఐవిపిఏ (IVPA) అధ్యక్షుడు సుధాకర్ దేశాయ్ మాట్లాడుతూ.. క్రూడ్, శుద్ధి చేసిన నూనెల మధ్య సుంకం తేడాను 19.25 శాతానికి పెంచాలన్న IVPA సిఫార్సును ప్రభుత్వం అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం ‘మేక్ ఇన్ ఇండియా’ను ప్రోత్సహిస్తుందని, శుద్ధి చేసిన నూనెల దిగుమతుల వల్ల దేశీయ నూనె పరిశ్రమకు జరుగుతున్న నష్టాన్ని నివారణ చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
మెహతా మాట్లాడుతూ.. ఈ నిర్ణయం నూనె శుద్ధి పరిశ్రమలకు, వినియోగదారులకు రెండింటికీ లాభదాయకమని, క్రూడ్ నూనెలపై సుంకం తగ్గడం వల్ల దేశీయ ధరలు తగ్గుతాయని చెప్పారు. గతంలో, సెప్టెంబర్ 14 2024న క్రూడ్ సోయాబీన్ ఆయిల్, క్రూడ్ పామాయిల్, క్రూడ్ సూర్యకాంతి నూనెలపై సుంకం 0 శాతం నుండి 20 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే.