Gold Price : బంగారం ధర బంగారమాయెనే. 60.. 70.. 80.. 90.. వేలకు వేలు పెరుగుతూనే పోతోంది. కాస్త తగ్గితే కొందాం అనుకునే వాళ్లకు ఎప్పటికప్పుడు షాక్ ఇస్తూనే ఉంది. 60 వేల దగ్గర చాలా నెలలే గోల్డ్ రేట్ స్థిరంగా ఉంది. ఆ తర్వాతే రప్పరప్పా పెరుగుతోంది. గత ఏడాది తులం 70 వేలు అన్నారు. ఈయేడు 80 వేలతో వామ్మో అనిపించింది. ట్రంప్ దెబ్బకు ఇప్పుడు ఏకంగా 90 వేలకు చేరింది. చూస్తూనే ఉండండి.. రేపోమాపో, మరో నెలకో. ఈ ఏడాది చివరకో.. తులం బంగారం లక్ష.. అక్షరాలా లచ్చ రూపాయలను దాటేస్తుందని బులియన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ న్యూస్ తెలిసి.. అబ్బా.. కొనకుండా ఎంత తప్పు చేశామని ఇప్పటికే చాలామంది బాధపడిపోతున్నట్టున్నారు. ఇప్పుడు లక్షా అని నోరెళ్లబెట్టి ఊరుకుంటే.. రాబోవు రోజుల్లో ఆ లక్షకు కూడా తులం బంగారం రాకపోవచ్చు అంటున్నారు. ఎందుకంటే.. అది బంగారం మరి.
బంగారం ధర ఎందుకు పెరుగుతోందంటే..
అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్కు విపరీతమైన డిమాండ్ ఉంది. స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతున్నాయి. మదుపర్లు పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు. ఆ సొమ్మంతా సురక్షితమైన పెట్టుబడి సాధనంగా భావించే బంగారంలో పెడుతున్నారు. అందుకే గోల్డ్ రేట్ భారీగా పెరుగుతోంది. అంతేకానీ.. పెళ్లిళ్ల సీజన్ అని కాదు. ఆషాఢం వస్తోందని తగ్గుతుందని కూడా అనుకోకండి. పసిడి ధరలకు.. మన పెళ్లిళ్లు, ఆషాఢంతో అసలేమాత్రం సంబంధం ఉండదు. రేట్ డిసైడ్ చేసేది అంతర్జాతీయ పెట్టుబడులే.
ట్రంప్ దెబ్బకు బంగారం దగదగ
ఇప్పటికే గోల్డ్కు గుడ్ టైమ్ నడుస్తుండగా.. అమెరికా అధ్యక్షుడు ప్రెసిడెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థను మరీ కుదిపేస్తున్నాయి. లేటెస్ట్గా ఇండియా, కెనడా, చైనా, జపాన్, యూరప్ లతో సహా చిన్నాపెద్దా దేశాలపై ప్రతీకార సుంకాలు బాదేశాడు. ట్రంప్ దెబ్బకే ప్రస్తుతం దేశీయ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల గోల్డ్ ధర 90 వేలు దాటేసింది. ట్రంప్ సుంకాల వల్ల అమెరికాలో ఆర్థిక మాంద్యం వస్తుందనే ఊహాగానాల నేపథ్యంలో.. బంగారానికి భారీ డిమాండ్ నెలకొంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ సైతం రేట్ల కోతకు సిద్ధం అవుతోందనే అంచనాలతో ఇన్వెస్టర్లు హడలిపోతున్నారు. వారంతా బంగారం వైపు చూస్తున్నారు. ప్రపంచ దేశాల్లో అనిశ్చితి ఇలానే కొనసాగితే.. అతిత్వరలోనే గోల్డ్ రేట్ రూ.లక్ష మార్క్ను టచ్ చేస్తుందని పక్కాగా చెబుతున్నారు.
Also Read : పాస్టర్ ప్రవీణ్ కేసులో కంప్లీట్ డీటైల్స్
ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు?
మన భారతీయుల మైండ్ సెట్టే అలా ఉంటుంది. కాస్త తగ్గితే బాగుండు.. కొన్ని రోజులు ఆగుదాం.. ఆషాడం వరకూ వెయిట్ చేద్దాం.. తులానికి ఏ వెయ్యో, రెండు వేలో తగ్గాక కొందాం.. ఇలా అనుకుంటూ ఉంటాం. గతంలో ఎంత అనుభవం ఉన్నా.. ఎన్నిసార్లు గోల్డ్ రేట్కు రెక్కలొచ్చి ఎగిరిపోయినా.. వెంటనే బంగారం కొనే సాహసం మాత్రం చేయం. ఫలితంగా చూస్తుండగానే పసిడి ధర పైపైకి వెళ్లిపోతుంటుంది. తులం బంగారం లక్ష రూపాయలు దాటేస్తుందని అంటుంటే.. ఇప్పటికే బంగారం కొన్నవాళ్లు, ఇంట్లో తులాలకు తులాలు ఉన్నవాళ్లు ఖుషీఖుషీ అవుతున్నారు. ఇప్పుడు కొనాలని అనుకునే వాళ్లకు మాత్రం డిసప్పాయింట్మెంటే.