HDFC Bank Charges: బ్యాంకులు ట్రెండ్ మార్చాయా? సెల్ ఫోన్ కంపెనీల మాదిరిగా వ్యవహరిస్తున్నాయా? బ్యాంకు ఖాతా ఓపెన్ అయ్యేవరకు ఒకమాట.. ఆ తర్వాత మరో మాట మొదలుపెడుతున్నాయా? అసలు ప్రభుత్వం-ప్రైవేటు బ్యాంకులకు సేవింగ్ ఖాతాదారుల సంఖ్య ఎందుకు తగ్గిపోతోంది? అకౌంట్ తీసుకోవడానికి సామాన్యులు ఇష్టపడడం లేదు. దీనికోసం చాలా బ్యాంకులు సేవింగ్ ఖాతాదారులను పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇదే క్రమంలో ప్రైవేటు బ్యాంకులు కస్టమర్లపై ఛార్జీల పేరుతో వడ్డన మొదలుపెట్టాయి. మొన్నటికి మొన్న ఐసీఐసీఐ బ్యాంకు మినిమం బ్యాలెన్స్ విషయంలో 10 వేల నుంచి అమాంతంగా 50 వేలకు పెంచేసింది. ఆ తర్వాత వెనక్కి తగ్గిందనుకోండి. అది వేరే విషయం. మరో ప్రైవేటు బ్యాంకు దొడ్డిదారిన కస్టమర్లపై ఛార్జీల పేరుతో వడ్డన రెడీ చేసింది.
ఒకప్పుడు అకౌంట్ కోసం సామాన్యులు బ్యాంకుల చుట్టూ తిరిగేవారు. ఇప్పుడు సామాన్యుల చుట్టూ బ్యాంకులు తిరుగుతున్నాయి. సేవింగ్ అకౌంట్ తీసుకోవాలని పదేపదే ఫోన్లు చేసి తెగ టార్చర్ చేస్తున్నాయి. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ కస్టమర్ల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకుంది. క్యాష్ ట్రాన్సాక్షన్, చెక్కుల సేవలతోపాటు పలు సర్వీసులపై ఛార్జీలను పెంచుతోంది.
క్యాష్ ట్రాన్సాక్షన్లు, చెక్కు సర్వీసులు, సర్టిఫికెట్ ఇష్యూయెన్స్, ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్స్ వాటిని ప్రభావితం చేయనుంది. పరిమితి మించి ట్రాన్సాక్షన్లు చేసినవారిపై రుసుములను పెంచేసింది. నెఫ్ట్-NEFT, RTGS, IMPS వంటివి ప్రీమియం అకౌంట్ హోల్డర్లు, సీనియర్ సిటిజెన్లకు వేర్వేరుగా ఉంటాయి. సేవింగ్స్, శాలరీ, ఎన్ఆర్ఐ అకౌంట్లపై కొత్త రూల్స్ ఆగష్టు ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయి.
ALSO READ: బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ పై కొత్త నియమాలు.. పెనాల్టీ తప్పదా?
హెచ్డీఎఫ్సీ బ్యాంకు తీసుకొచ్చిన కొత్త నిబంధనలేంటి? ఏటీఎం ట్రాన్సాక్షన్ల సంఖ్యను బాగా తగ్గించింది. కస్టమర్లకు నాలుగు ఫ్రీ ట్రాన్సాక్షన్స్ కు పరిమితం చేసింది. ఆ తర్వాత చేసిన ఒక్కో ట్రాన్సాక్షన్కు రూ. 150 ఛార్జీ పడనుంది. నెల వారీగా నగదు పరిమితిని తగ్గించింది. గతంలో అకౌంట్కు రూ. 2 లక్షలుగా ఉండేది. తాజాగా లక్షకు తగ్గించింది.
ప్రతి రూ. 1000 లకు రూ. 5 ఛార్జీ పడుతుంది. ఒకప్పుడు బ్యాలెన్స్ సర్టిఫికెట్, ఇంట్రెస్ట్ సర్టిఫికెట్, అడ్రస్ కన్ఫర్మేషన్ సర్వీసులు ఉచితగా ఉండేవి. ఇప్పుడు వాటిపై ఛార్జీలను వేసింది. ఈ సర్వీసులపై రెగ్యులర్ కస్టమర్లకు రూ. 100, సీనియర్ సిటిజెన్స్కు రూ. 90 ఛార్జీ చేయబోతోంది.
చెక్ రిటర్న్ ఛార్జీలు మారాయి.చెక్ ఫస్ట్ రిటర్న్కు ఛార్జీ రూ. 500 గా ఉండేది. సీనియర్ సిటిజెన్లకు రూ.450. రెండోసారి చెక్ రిటర్న్ అయితే ఛార్జీలు రూ. 550 అయ్యింది. అంటే అదనంగా 50 రూపాయలు పెంచేసింది. అదే సీనియర్ సిటిజన్స్కు రూ. 500 గా ఉంటుంది. సాంకేతిక కారణాలతో ఛార్జీలు రూ. 50, రూ. 45 గా ఉన్నాయి. RTGS ఛార్జీలను సవరించింది.
అంతకుముందు రూ. 2 లక్షలపై చేసే వాటికి మామూలు కస్టమర్లకు రూ. 15 ఉండేది. సీనియర్ సిటిజెన్లకు రూ. 13.50 ఛార్జీ ఉండేది. ఇప్పుడు రూ. 2-5 లక్షల మధ్య లావాదేవీలపై రూ. 20 నుంచి రూ. 18 కి పెంచింది. 5 లక్షలు దాటితే వరుసగా రూ. 45 నుంచి రూ. 40.50 గా ఉంటుంది.
NEFT ఛార్జీలు పెరిగాయి. రూ. 10 వేల వరకు కస్టమర్లకు రెండు రూపాయలు, సీనియర్ సిటిజన్లకు రూ. 1.80 ఛార్జీ ఉండేది. ఇప్పుడు ఆ ఛార్జీలను సవరించింది. 10 వేల నుంచి లక్ష మధ్య ట్రాన్సాక్షన్లపై రూ. 4, సీనియర్ సిటిజన్లకు రూ. 3.60 గా ఉండనుంది. లక్షనుంచి 2 లక్షల మధ్య అయితే రూ. 14, రూ. 12.60 గా ఉంది. రెండు లక్షలపైన నెఫ్ట్ ట్రాన్సాక్షన్లు చేస్తే రూ. 24, రూ. 21.60 గా ఉంటుంది. మొత్తానికి బ్యాంకులు సైతం క్రమంగా బాదుడు కార్యక్రమం మొదలైందన్నమాట.