PM Modi: మిడిల్ ఈస్ట్ యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం తలెత్తింది. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన పెరుగుతున్న సమయంలో.. విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసేందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాలను తిరిగి ప్రారంభించాలని, ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. అంతేకాకుండా ఏడాది పాటు పెళ్లిళ్లకు భారీగా బంగారం కొనడం మానుకోవాలని ప్రధాని ఆదివారం పిలుపునిచ్చారు.
ముడి చమురు సరఫరా అంతరాయంతో చమురు ధరలు భారీ పెరుగుతున్నాయి. ఆర్థిక సంక్షోభంతో ప్రపంచ దేశాలు పోరాడుతున్న సమయంలో ప్రధాని మోదీ తాజా పిలుపు నిచ్చారు. పెట్రోల్, డీజిల్ సేవింగ్ ను జాతీయ బాధ్యతగా భావించాలన్నారు. కరోనా కాలంలో వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్లైన్ మీటింగులు, వీడియో కాన్ఫరెన్సులు వ్యవస్థలు అభివృద్ధి చేశారన్నారు. వాటికి అలవాటు కూడా పడ్డామని మోదీ అన్నారు. మరోసారి ఆ పద్ధతులను తిరిగి ప్రారంభించడం అత్యవసరం, అది జాతీయ ప్రయోజనాలకు మంచిదన్నారు.
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు, హర్మూజ్ జలసంధి దిగ్బంధంతో చమురు అంతరాయాలతో ముడి చమురు ధరలు బ్యారెల్కు దాదాపు 70 డాలర్ల నుంచి సుమారు 126 డాలర్లకు పెరిగాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ధరల పెంపును నేరుగా ప్రకటించకుండా, పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ పదేపదే నొక్కి చెప్పారని విశ్లేషకులు అంటున్నారు.
“ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్-డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ను పొదుపుగా వాడుకోవడం, వాటి కొనుగోలుకు వెచ్చించే విదేశీ మారకద్రవ్యాన్ని కూడా ఆదా చేయాల్సిన బాధ్యత మనందరిది” అని ప్రధాని మోదీ అన్నారు. ఒక సంవత్సరం పాటు పెళ్లిళ్లకు బంగారం కొనవద్దని ప్రజలకు మోదీ విజ్ఞప్తి చేశారు.
దాదాపు నాలుగేళ్లలో దేశంలో ఇంధన ధరలు త్వరలో తొలిసారిగా భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రభుత్వ, పరిశ్రమ వర్గాలు చెబుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు భారీగా నష్టాలను ఎదుర్కొంటున్నాయి. మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు సంకేతాలు ఇస్తున్నాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు నెలకు దాదాపు రూ.30,000 కోట్ల నష్టాలను ఎదుర్కుంటున్నాయని సమాచారం. వినియోగదారులపై భారం పడకుండా ప్రభుత్వం, చమురు కంపెనీలు పెట్రోల్పై లీటరుకు దాదాపు రూ.24, డీజిల్పై లీటరుకు రూ.30 వరకు భారాన్ని భరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభిస్తే, పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు సుమారు రూ.4- రూ.5 వరకు పెరగవచ్చు, ఎల్పీజీ సిలిండర్ ధర రూ.40-50 వరకు పెరిగే అవకాశం ఉంది.
Also Read: ప్రధాని మన్కీ బాత్లో కీలక అంశాలు.. పవర్ సెక్టార్, అణుశక్తి గురించి ప్రస్తావన