RBI News: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది.వరుసగా రెండోసారి రెపో రేట్లను తగ్గించింది. ఫిబ్రవరిలో రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఇప్పుడు అదే విధంగా మరో 25 బేసిస్ పాయింట్లు తగ్గించినట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు.
ఆర్భీఐ కీలక నిర్ణయం
ప్రస్తుతమున్న రెపో రేటు 6.25 శాతం నుంచి 6 శాతానికి చేరింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ సోమవారం సమావేశం అయ్యింది. అంతర్జాతీయ జరుగుతున్న పరిణామాలు గమనించిన తర్వాత బుధవారం గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక ప్రకటన చేశారు. మానిటరీ పాలసీ కమిటీ తగ్గింపును ఏకగ్రీవంగా ఆమోదించిందని తెలిపారు.
ఈఎంఐలు తగ్గే ఛాన్స్
ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. దీంతో బ్యాంకులు లోన్లపై వడ్డీ రేట్లను తగ్గించనున్నాయి. ఒకవిధంగా చెప్పాలంటే రుణ గ్రహీతలకు బిగ్ రిలీఫ్ అన్నమాట. రుణగ్రహీతలకు ఆర్థిక భారాన్ని తగ్గుతుంది. లేదంటే రుణ కాల పరిమితి తగ్గించుకోవచ్చు. ఇదే సమయంలో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. బ్యాంకులు దీనిపై ఎప్పుడు నిర్ణయం తీసుకుంటాయనేది అసలు ప్రశ్న.
ఒకవిధంగా చెప్పాలంటే డిపాజిటర్లకు ఊహించని షాక్ అని అంటున్నారు నిపుణులు. ప్రపంచ వృద్ధి మందగమనం కారణంగా ముడి చమురు ధరలు తగ్గుతాయన్నారు ఆర్బీఐ గవర్నర్. తయారీ కార్యకలాపాల్లో మెరుగుదల సంకేతాలు ఉన్నట్లు చెప్పారు. ప్రపంచవ్యాప్త అనిశ్చితుల కారణంగా వస్తువుల ఎగుమతులపై ఒత్తిడి ఉంటుందని చెప్పకనే చెప్పారు.
ALSO READ: ఒక రాష్ట్రం.. ఒక గ్రామీణ బ్యాంక్, మే ఒకటి నుంచి అమలు
ఆర్బీఐ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటును 5.75 శాతానికి, ఎంఎస్ఎఫ్- మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటును 6.25 శాతానికి పరిమితం చేసింది. 2011-12లో ఆర్పీఐ ప్రవేశపెట్టింది ఎంఎస్ఎఫ్. ఇది స్వల్పకాలిక రుణ పథకం. బ్యాంకులు.. ప్రభుత్వ సెక్యూరిటీలను తాకట్టు పెట్టి రెపో రేటు కంటే ఎక్కువ రేటుకు రుణాలు తీసుకోవచ్చు.
కూలిన బ్యాంకింగ్ షేర్లు
ప్రస్తుతం ద్రవ్యోల్బణం తక్కువగానే ఉందన్నారు ఆర్బీఐ గవర్నర్. ద్రవ్యోల్బణంలో నిర్ణయాత్మక మెరుగుదల కనిపిస్తోందన్నారు. ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటన తర్వాత బ్యాంకింగ్ సెక్టార్ స్టాక్స్ పతనం అయ్యాయి. దాదాపు రెండు శాతం వరకు పడిపోయాయి.
ఎఫ్డీలకు షాక్?
రెపో రేటు తగ్గితే బ్యాంకులు ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను తగ్గించాల్సి పరిస్థితి ఏర్పడింది. బ్యాంకుల్లో ఎఫ్డీలు ఇటీవల కాలంలో వినియోగదారులు మొగ్గు చూపలేదని నివేదికలు బయటకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ పెట్టుబడులపై దృష్టి పెట్టాల్సి ఉంది.
దేశంలో విదేశీ మారక నిల్వలు 676 బిలియన్ డాలర్లు ఉన్నట్లు వెల్లడించారు ఆర్బీఐ గవర్నర్. రాబోయే 11 నెలల దిగుమతులను నిర్వహించడానికి సరిపోతాయన్నారు. 2025-26 ఏడాదికి జీడీపీ వృద్ధి రేటు 6.5 శాతంగా ఉండవచ్చని ఓ అంచనా. త్రైమాసికాల వారీగా పరిశీలిస్తే తొలి రెండు 6.5 శాతం, 6.7 శాతం ఉంటుందని భావిస్తోంది. మూడు, నాలుగు త్రైమాసికాల్లో 6.6 శాతం, 6.3 శాతం ఉండవచ్చు.