Reliance AI Investment: దిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సదస్సుతో.. దేశ వ్యాప్తంగా ఏఐ పెట్టుబడులపై చర్చలు మొదలయ్యాయి. ప్రముఖ సంస్థ రిలయన్స్.. జియో ఏఐలో రూ.10 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టాలని యోచిస్తున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. దేశవ్యాప్తంగా AI విస్తరించాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం నుంచి వచ్చే ఏడు సంవత్సరాలలో జియో ఏఐలో రూ. 10 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించామన్నారు.
ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్లో ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. రిలయన్స్ జియో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిందని గుర్తుచేశారు. అలాగే సాంకేతికతను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఏఐ ఖర్చును గణనీయంగా తగ్గిస్తుందని అన్నారు. కృత్రిమ మేధస్సు ఇంకా ప్రారంభ దశలోనే ఉందని ఆయన చెప్పారు. ఏఐ వాడకం విస్తృతంగా పెరిగినా..ఉద్యోగాలు తగ్గుతాయనే ఆందోళనలను కొట్టిపారేశారు. అందుకు బదులుగా కొత్తగా, ప్రత్యేకమైన నైపుణ్యం కలిగిన ఉపాధి అవకాశాలను సృష్టించడం ద్వారా ఏఐ పని తీరును మారుస్తుందని అంబానీ అన్నారు.
ఏఐ పూర్తి క్వాలిటీ ఇంకా అందుబాటులోకి రాలేదన్నారు. ఏఐ టెక్నాలజీ ఆర్థిక అవకాశాలను విస్తరిస్తూ “సూపర్ సమృద్ధి” యుగానికి నాంది పలికిందని అన్నారు. ఏఐ ఉద్యోగాలను తొలగిస్తుందనే భయాలు తప్పు, ఎందుకంటే గత సాంకేతిక మార్పులు.. ఆవిష్కరణలను అభివృద్ధి చేస్తూ కొత్త ఉపాధి మార్గాలను సృష్టించాయన్నారు.
దేశంలో రోజు రోజుకూ పెరుగుతున్న డిజిటల్ టెక్నాలజీకి ఏఐ తోడైతే దేశానికి మరింత బలం చేకూరుతుందని ముఖేష్ అంబానీ చెప్పారు. ఏఐను మరింతగా విస్తరించేందుకు రిలయన్స్ జియో.. భారతీయ వ్యాపారాలు, స్టార్టప్లు, ఐఐటీలు, పరిశోధనా సంస్థలతో కలిసి పనిచేయాలని యోచిస్తుందన్నారు. హై కంప్యూటింగ్ ఖర్చులు పరిమిత మౌలిక సదుపాయాలు ఏఐ విస్తరణకు కీలకమైన అడ్డంకులు అన్నారు. జియో ఇంటెలిజెన్స్ ఈ సవాళ్లను సావరిన్ కంప్యూటింగ్ ఫ్రేమ్వర్క్ ద్వారా పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు.
Also Read: చేతులు కలపని సీఈవోలు.. ఏఐ ఇంపాక్ట్ సదస్సులో ఆసక్తికర సంఘటన
ఈ ప్రయత్నంలో భాగంగా, జామ్నగర్లో గిగావాట్-స్కేల్ డేటా సెంటర్లను నిర్మించాలని రిలయన్స్ యోచిస్తుంది. ఏఐ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికి రిలయన్స్ భారీగా పెట్టుబడులు పెడుతుందన్నారు.