Sun TV: తమిళనాడులోని మారన్ ఫ్యామిలీలో చిచ్చు మొదలైందా? ఇప్పుడు తారాస్థాయికి చేరిందా? సన్టీవీ ఛైర్మన్ కళానిధికి సోదరుడు ఎంపీ దయానిధి మారన్ నోటీసుల వెనుక ఏం జరిగింది? తీవ్రమైన ఆరోపణల వెనుక అసలు కథేంటి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.
తమిళనాడులోని మారన్ ఫ్యామిలీలో అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరాయి. 20 ఏళ్లుగా బలమైన కోటను నిర్మించారు మారన్ సోదరులు. ఇప్పుడు ఆ కోటకు బీటలు పడుతున్నాయి. దక్షిణాదిలో సన్ టీవీ పేరు చెప్పగానే మారన్ సోదరులు గుర్తుకు వస్తాయి. తమిళనాడును కేంద్రంగా చేసుకుని దక్షిణాదిలో అంచెలంచెలుగా సన్ టీవీ నెట్వర్క్ని విస్తరించింది.
కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఏపీ, తెలంగాణ ఆ ఛానెళ్లదే హవా. సౌత్ను తమ గుప్పిట్లోకి తీసుకోవాలని నార్త్ నుంచి అనేక ఛానెళ్లు పోటీపడ్డాయి. మారన్ బ్రదర్స్ ముందు ఎవరి ఆటలు సాగలేదు. న్యూస్, సీరియల్స్, సినిమాలు ఆ గ్రూప్దే ఆధిపత్యం. రెండు దశాబ్దాలకు పైగానే సన్టీవీ నెట్వర్క్ చెక్ చెదరకుండా ఉంది. ఇప్పుడు అన్నదమ్ముల మధ్య గొడవలు మొదలయ్యాయి.
తాజాగా సన్టీవీ ఛైర్మన్ కళానిధి మారన్కు ఆయన సోదరుడు డీఎంకే ఎంపీ దయానిధి మారన్ లీగల్ నోటీసులు పంపారు. దయానిధి మారన్ తరపు లాయర్ ఈనెల జూన్ 10న నోటీసులను పంపారు. ఈ విషయాన్ని ప్రముఖ ఇంగ్లీష్ పత్రికలు వెల్లడించాయి. కంపెనీలో వాటాల తీరును 2003 నాటి స్థితికి మార్చాలన్నది మొదటి పాయింట్.
ALSO READ: రియల్ ఎస్టేట్ రంగానికి బూమ్, ఒక్కో ప్లాట్ 10 కోట్లు
మనీలాండరింగ్ సహా మోసపూరిత వ్యవహారాలను కళానిధి మారన్ నడిపారన్నది సెకండ్ పాయింట్. తీవ్ర నేరాల దర్యాప్తు కార్యాలయం చర్యలు తీసుకోవాలని స్టాలిన్ ప్రభుత్వాన్ని కోరినట్టు మూడో పాయింట్. నోటీసులు అందుకున్న వారిలో సన్టీవీ ఛైర్మన్ కళానిధి మారన్, ఆయన భార్య కావేరి మారన్ కూడా ఉన్నారు. బ్రదర్స్ వ్యవహారం కావడంతో సన్టీవీ ప్రభావం పడదని అంటున్నారు.
సన్ టీవీ నెట్వర్క్ తొలుత సుమంగలి పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో మొదలైంది. సెప్టెంబర్ 15, 2003న ప్రారంభమైంది. అప్పటి నుంచి సన్ టీవీ గ్రూప్కు ఛైర్మన్గా కళానిధి మారన్ వ్యవహరిస్తూ వచ్చారు. దయానిధి పంపిన నోటీసుల్లో మరొక పాయింట్ ప్రస్తావించారు. సన్ టీవీలో ఉద్యోగిగా మాత్రమే కళానిధి పని చేశారని, ఆయన ప్రతీ నెల జీతం పొందారని పేర్కొన్నారు. ఆయనకు ఆ సంస్థలో ఎలాంటి వాటాలు లేవని ఎత్తిచూపింది.
మాజీ సీఎం కరుణానిధి మేనల్లుడు మురసోలి మారన్. ఈయన కేంద్ర మంత్రిగా పని చేశారు. ఆయన కొడుకులే దయానిధి, కళానిధి మారన్లు. మురసోలి మారన్ అనారోగ్యం బారిన పడినప్పుడు అమెరికా నుండి చెన్నైకి వచ్చారు కళానిధి మారన్. వాటాదారుల ప్రమేయం లేకుండా సన్ టీవీ షేర్లలో 60 శాతం వాటాను ఆయన దక్కించుకున్నట్లు చెన్నై వర్గాల మాట.
డివిడెండ్ల రూపంలో భారీగా ప్రయోజనాలను పొందుతున్నారని అంటున్నారు. దీనికి అసలు యజమానులు దివంగత మాజీ సీఎం కరుణానిధి భార్య దయాళు, దివంగత మురసోలి మారన్ వారసుల వాటాలను తిరిగి ఇవ్వాలన్నది అసలు దయానిధి మాట. సోదరుడు దయానిధి నోటీసుపై కళానిధి ఎలాంటి బహిరంగ ప్రకటన జారీ చేయలేదు.