-దేశీయ మార్కెట్లు మటాష్
-రూ.7 లక్షల కోట్ల సంపద ఆవిరి
-సెన్సెక్స్ 1,235, నిఫ్టీ 320 పాయింట్ల పతనం
-ట్రంప్ టారిఫ్ ఆలోచనలపై ఇన్వెస్టర్ల అలర్ట్
-అమ్మకాల ఒత్తిడితో తీవ్ర నష్టాలు
ముంబై/న్యూఢిల్లీ, స్వేచ్ఛ: రెండవసారి అమెరికా అధ్యక్షుడిగా సోమవారం ప్రమాణస్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ ఇండియన్ స్టాక్ మార్కెట్లలో గుబులు పుట్టించారు. తొలి రోజే దూకుడుగా దాదాపు 80 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు జారీ చేసిన ఆయన, పొరుగు దేశాలైన కెనడా, మెక్సికోపై వాణిజ్య సుంకాలను విధించారు. మరికొన్ని దేశాలపై కూడా సుంకాలు తప్పవని హెచ్చరించారు. ప్రతిపాదిత దేశాల జాబితాలో భారత్ కూడా ఉండడంతో మదుపర్లు కలవరం చెందారు. దీంతో, మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. ఇరు ప్రామాణిక సూచీలు దాదాపు ఒకటిన్నర శాతం మేర నష్టపోయాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 1,235 పాయింట్లు లేదా 1.60 శాతం క్షీణించి 75,838.36 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ-50 సూచీ 320 పాయింట్లు లేదా 1.37 శాతం పతనమై 23,024.65 వద్ద ముగిసింది. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 2 శాతం చొప్పున క్షీణించాయి. సెన్సెక్స్ ప్రధాన సూచీపై జొమాటో, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు అత్యధికంగా దిగజాయి. కేవలం అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్సీఎల్ టెక్ మాత్రమే గ్రీన్లో ముగిశాయి.
నిఫ్టీపై రంగాలవారీగా చూస్తే రియల్టీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 4 శాతానికి పైగా, నిఫ్టీ బ్యాంక్, ఆటో, ఫైనాన్షియల్ రంగ షేర్లు దాదాపు 2 శాతం కంటే తక్కువగా క్షీణించాయి. తీవ్ర నష్టాల కారణంగా స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లు మంగళవారం ఒక్క రోజే ఏకంగా రూ.7 లక్షల కోట్ల సంపదను నష్టపోయారు. భారీ పతన ప్రభావంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.431.6 లక్షల కోట్ల నుంచి రూ.424.3 లక్షల కోట్లకు పడిపోయింది.
Also Read: అంతర్జాతీయంగా దూసుకుపోతున్న భారత ఐటీ కంపెనీలు.. టాప్ 10లో నాలుగు మనవే!
పతనానికి దారితీసిన కారణాలివే
అమెరికా అధ్యక్షుడిగా సోమవారం బాధ్యతలు స్వీకరించిన డొనాల్డ్ ట్రంప్ పొరుగుశాలపై కెనడా, మెక్సికోపై వాణిజ్య సుంకాలను విధించారు. మరికొన్ని దేశాలపై కూడా టారిఫ్ విధిస్తామని ప్రకటించారు. ఈ జాబితాలో భారత్ కూడా ఉండడం దేశీయ మార్కెట్లో మదుపర్ల సెంటిమెంట్ను బలహీనం చేసింది. ఇమ్మిగ్రేషన్ విధానంలో మార్పులు ప్రకటించడం టెక్ రంగ స్టాక్స్పై ప్రతికూలప ప్రభావం చూపింది.
మరోవైపు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరోవైపు, విదేశీ సంస్థాగత పెట్టుబడులు క్షీణించడం, మూడో త్రైమాసికంలో కంపెనీల ప్రదర్శనకు సంబంధించిన గణాంకాలు ఆశాజనకంగా లేకపోవడం, స్థూల ఆర్థిక వ్యవస్థ గణాంకాలు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం మార్కెట్ల క్షీణతకు దారితీశాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.