UPI New Rules: మన రోజువారీ జీవితంలో డబ్బు చెల్లింపులు, డబ్బు ట్రాన్స్ఫర్ అంటే ఇక నగదు అవసరం లేకుండానే ఫోన్లో ఒక్క ట్యాప్తో పూర్తవుతున్నాయి. యూపీఐ రూపంలో వచ్చిన ఈ సౌకర్యం ఇప్పటికీ కోట్లాది మంది ప్రజలకు ప్రధానమైన లావాదేవీ మార్గమైంది. చిన్న టీ షాపులోనుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు ప్రతీ చోటా యూపీఐ వాడకం పెరిగిపోయింది. అయితే ఇప్పుడు ఈ సౌకర్యానికి సంబంధించిన కొన్ని కొత్త నియమాలు ఈ నెల 15 నుంచి అమల్లోకి రానున్నాయి.
ఈ నెల 15 నుంచి కొత్త రూల్స్
ముందుగా ఈ నియమాలు ఎందుకు తీసుకొస్తున్నారు అన్నది అర్థం చేసుకోవాలి. గత కొన్నేళ్లుగా యూపీఐ లావాదేవీలు గణనీయంగా పెరిగాయి. ఒకే నెలలో లక్షల కోట్ల రూపాయల విలువ గల ట్రాన్సాక్షన్లు జరిగిపోతున్నాయి. చాలా సందర్భాల్లో మోసాలు, డబుల్ పేమెంట్లు, అనవసరమైన ట్రాన్సాక్షన్లు కూడా ఎక్కువయ్యాయి. అంతేకాదు, యూపీఐని వాడుతున్న యూజర్లు ఎప్పటికప్పుడు సేఫ్గా ఉండేలా, అలాగే బ్యాంకులకు కూడా బరువుగా కాకుండా ఉండేలా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా – ఎన్పిసిఐ కొన్ని కొత్త మార్గదర్శకాలు రూపొందించింది.
చిన్న మొత్తాలకు చెక్
ఇకపై చిన్న మొత్తంలో జరిగే లావాదేవీలకు పరిమితి (Limit) పెడుతున్నారు. ఉదాహరణకు, పదిరూపాయలు, ఇరవైరూపాయలు వంటి చిన్న మొత్తాలు పదిసార్లు, ఇరవైసార్లు వరుసగా ట్రాన్స్ఫర్ చేస్తే, బ్యాంక్ సిస్టమ్ వాటిని ఆటోమేటిక్గా స్టాప్ చేస్తుంది. ఎందుకంటే ఇలాంటి ట్రాన్సాక్షన్లు చాలాసార్లు ఫ్రాడ్లలో భాగమై ఉంటాయి. కాబట్టి రోజులో చిన్న మొత్తాలతో ఎన్నిసార్లు ట్రాన్సాక్షన్ చేయవచ్చో స్పష్టమైన పరిమితి ఉంటుంది.
ఆటోపేలో కూడా మార్పులు
ఇంకా, ఆటోపే (AutoPay) సౌకర్యంపై కూడా మార్పులు వస్తున్నాయి. మనలో చాలామంది మొబైల్ రీఛార్జ్లు, ఓటీటీ సబ్స్క్రిప్షన్లు, ఈఎంఐలు ఆటోమేటిక్గా యూపీఐ ద్వారా డెడక్ట్ అయ్యేలా పెట్టుకుంటారు. ఇప్పుడు ఎన్పిసిఐ చెప్పింది ఏమిటంటే, పైన తెలిపిన ఆటోమేటిక్ చెల్లింపులకు ఒక పరిమితి వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ ఐదు వేల రూపాయల కంటే ఎక్కువ మొత్తాన్ని ఆటోపేతో కట్టాలంటే ముందుగా యూజర్కి బ్యాంక్ నుండి నోటిఫికేషన్ వస్తుంది. యూజర్ ఆమోదం ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ డబ్బు డెడక్ట్ అవుతుంది. దీని వలన ఎవరికీ తెలియకుండానే పెద్ద మొత్తంలో డబ్బు కోత పడిపోవడం జరగదు.
Also Read: Jio Unlimited Offer: జియో షాకింగ్ ఆఫర్..! కేవలం రూ.51కి అన్లిమిటెడ్ 5జి ఇంటర్నెట్
యూపీఐ క్రెడిట్ లింక్-కొత్త గైడ్లైన్స్
ఇక యూపీఐ క్రెడిట్ లింక్ సదుపాయంపై కూడా కొత్త గైడ్లైన్స్ వస్తున్నాయి. ఇప్పటివరకు మనం ఎక్కువగా సేవింగ్స్ అకౌంట్ లేదా కరెంట్ అకౌంట్ని యూపిఐకి లింక్ చేసేవాళ్లం. కానీ ఆర్బిఐ ఇటీవల యూపిఐకి క్రెడిట్ కార్డులను కూడా లింక్ చేసే అవకాశం ఇచ్చింది. దీని వలన చాలా మంది బిల్లులు, కొనుగోళ్లు క్రెడిట్ ద్వారా చేయడం మొదలుపెట్టారు. అయితే, ఇక్కడ కూడా ఒక లిమిట్ పెట్టబడింది. ప్రతి క్రెడిట్ కార్డ్ యూజర్ ఒక నిర్దిష్ట పరిమితి వరకు మాత్రమే యూపిఐ ద్వారా చెల్లింపులు చేయగలుగుతారు. ఆ మొత్తాన్ని మించితే మళ్లీ కార్డ్ ప్రొవైడర్ నుండి ఆమోదం తీసుకోవాల్సిందే.
వాడని ఖాతాలు ఆటోమేటిక్గా బ్లాక్
బ్యాంక్ ఖాతా ఉండి వాటిని ఉపయోగించకపోతే వాటిపై కూడా నియమాలు విధించారు. గతంలో ఆరు నెలల పాటు వాడని యూపిఐ ఖాతాలను ఆటోమేటిక్గా తాత్కాలికంగా బ్లాక్ చేస్తారు. యూజర్ తిరిగి యాక్టివేట్ చేసుకునే వరకు వాటి ద్వారా లావాదేవీలు జరగవు. దీని వలన డూప్లికేట్ లేదా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్లను తగ్గించవచ్చని ఎన్పిసిఐ భావిస్తోంది. మనం షాపింగ్ చేసేటప్పుడు, పాలు కొనుగోలు చేసినప్పుడు లేదా పెట్రోల్ బంక్లో చెల్లించినప్పుడు, ఒక నిర్దిష్ట పరిమితికి మించి పేమెంట్ చేస్తే, అటు యూజర్కూ, ఇటు వ్యాపారికీ కన్ఫర్మేషన్ మెసేజ్ రావడం తప్పనిసరి అవుతుంది. దీంతో మధ్యలో సాంకేతిక లోపాలు జరిగితే వెంటనే తెలుసుకోవచ్చు.
కాబట్టి ఇక నుంచి మనం యూపిఐ వాడేటప్పుడు ఈ నియమాలను గుర్తుంచుకోవాలి. లేకపోతే అనుకోకుండా ట్రాన్సాక్షన్ జరగకపోతే ఎందుకని అయోమయపడే పరిస్థితి వస్తుంది. కొత్త మార్పులు మనకు అసౌకర్యం కలిగించడానికి కాదు, భద్రత పెంచడానికి మాత్రమే. కాబట్టి ఈ నెల 15 తర్వాత యూపిఐ లావాదేవీలు ఇంతకుముందు కంటే మరింత సురక్షితంగా మారతాయి. ఇవన్నీ కలిపి ప్రజలు మోసాలకు గురికాకుండా కాపాడటం లక్ష్యంగా తీసుకొస్తున్నారు.