Consumer Compensation India| ప్రపంచంలోని అనేక దేశాల్లో పెద్ద కంపెనీలు వినియోగదారులకు బిలియన్ల డాలర్ల పరిహారం చెల్లించిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తన టాల్క్ పౌడర్ ఉత్పత్తుల కేసుల్లో 5.5 బిలియన్ డాలర్ల (550 కోట్ల డాలర్లు దాదాపు రూ.5 లక్షల 25 వేల కోట్లు) పరిహారం చెల్లించేందుకు అంగీకరించింది. అలాగే యాపిల్ కూడా సిరి ఫీచర్లకు సంబంధించిన కేసులో ఫిర్యాదులు చేసిన కస్టమర్లతో రాజీకి వచ్చింది. అయితే ఇలాంటి భారీ నష్టపరిహారాలు భారతదేశంలో చాలా అరుదుగా కనిపిస్తాయి. దీనికి ప్రధాన కారణం రెండు దేశాల న్యాయ వ్యవస్థల మధ్య ఉన్న తేడాలేనని నిపుణులు చెబుతున్నారు.
అమెరికా వంటి దేశాల్లో క్లాస్ యాక్షన్ కేసులు దాఖలు చేసే అవకాశం ఉంది. ఒకే సమస్యతో బాధపడిన లక్షలాది మంది వినియోగదారులు కలిసి ఒకే కేసు వేయవచ్చు. దీంతో కంపెనీలపై భారీ ఆర్థిక భారం పడే అవకాశం ఉంటుంది. అందుకే చాలా కంపెనీలు కోర్టు విచారణ కంటే శాంతియుతంగా డీల్ కుదుర్చుకోవడానికి ప్రయత్నిస్తాయి.
అమెరికా కోర్టులు అవసరమైతే పరిహారంతో పాటు శిక్ష కూడా విధించగలవు. దీంతో కంపెనీలు న్యాయపరమైన ప్రమాదాన్ని తగ్గించేందుకు ముందుగానే చర్యలు తీసుకుంటాయి.
మన దేశంలో వినియోగదారుల ఫిర్యాదులు ఎక్కువగా వ్యక్తిగతంగా దాఖలు అవుతాయి. ఇవి ప్రధానంగా వినియోగదారుల పరిరక్షణ చట్టం కింద పరిష్కరించబడతాయి. చాలా కేసుల్లో పరిహారం లభించే మొత్తం తక్కువగానే ఉంటుంది. కోర్టులు సాధారణంగా జరిగిన నష్టానికి మాత్రమే పరిహారం ఇస్తాయి. వేలాది మంది కలిసి ఒకే కేసు వేయడం చాలా అరుదుగా జరుగుతుంది. అందువల్ల కంపెనీలపై భారీ ఆర్థిక ఒత్తిడి ఉండదు.
2019లో అమల్లోకి వచ్చిన వినియోగదారుల పరిరక్షణ చట్టం హక్కులను మరింత బలోపేతం చేసింది. ఒకే సమస్యతో బాధపడిన వినియోగదారుల తరఫున ఫిర్యాదులు దాఖలు చేసే అవకాశం చట్టంలో ఉంది. అయితే ఈ విధానం అమెరికాలోని క్లాస్ యాక్షన్ వ్యవస్థతో పోలిస్తే చాలా పరిమితంగానే ఉంది.
భారత్లో అధికారులు ఎక్కువగా కంపెనీలపై జరిమానాలు విధించడం, ఉత్పత్తులను వెనక్కి తీసుకోవడానికి లేదా సరిదిద్దే ఆదేశాలు ఇవ్వడంపై దృష్టి పెడతారు. ఈ చర్యలు వినియోగదారుల రక్షణకు ఉపయోగపడినా, పెద్ద మొత్తంలో వ్యక్తిగత పరిహారం అందించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.
లోకల్సర్కిల్స్ నిర్వహించిన సర్వే ప్రకారం.. ఇండియాలో చాలామంది వినియోగదారులు తమ ఫిర్యాదులకు సరైన పరిష్కారం పొందలేకపోతున్నారు. చాలా కంపెనీలు ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని సర్వేలో పాల్గొన్నవారు తెలిపారు. వినియోగదారుల కోర్టుల ద్వారా పరిహారం పొందిన వారి సంఖ్య కూడా చాలా తక్కువగా ఉంది.
భారత చట్టం సామూహిక ఫిర్యాదులకు అవకాశం కల్పించినప్పటికీ, వాటిని అమలు చేయడం అంత సులభం కాదు. వేలాది మంది వినియోగదారులను ఒకే కేసులో చేర్చడం కష్టతరమైన ప్రక్రియ. అదనంగా న్యాయపరమైన ఖర్చులు, సమయం కూడా పెద్ద అడ్డంకులుగా మారుతున్నాయి.
Also Read: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సాలరీ పెరిగేది అప్పుడే.. 8వ పే కమిషన్ అప్డేట్ ఇదిగో
భారత్లో మరింత బలమైన క్లాస్ యాక్షన్ వ్యవస్థ అవసరమని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేసుల విచారణ వేగంగా పూర్తి కావాలి. కంపెనీలపై భారీ జరిమానాలు విధించే అవకాశాలు కూడా పెరగాలి. వినియోగదారులకు త్వరగా, సరైన పరిహారం అందేలా చట్టాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని వారు సూచిస్తున్నారు.
Also Read: ఫుడ్ డెలివరీ బాయ్గా పనిచేశాడు కట్ చేస్తే ఈ రోజు కోటీశ్వరుడు.. రోజుకు రూ.6.3 లక్షల ఆదాయం