భారత విమానయాన రంగంలో ప్రస్తుతం కొత్త డిబేట్ ప్రారంభమైంది. ఎయిర్పోర్ట్ల నిర్వహణ చేసే కంపెనీలు ఎయిర్లైన్స్ బిజినిస్ చేయవచ్చా లేదా అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదానీ గ్రూప్ కొత్త ఎయిర్లైన్స్ ప్రారంభించ వచ్చనే వార్తలు రాగానే తర్వాత ఈ చర్చ మరింత వేడెక్కింది. అయితే అదానీ గ్రూప్ తాము ఎలాంటి ఎయిర్లైన్ ప్రస్తుతానికి ప్రారంభించడం లేదని తెలిపింది. అయినప్పటికీ ఈ అంశంపై విమానయాన రంగంలో చర్చ కొనసాగుతోంది.
ఎయిర్పోర్ట్లు ప్రతి ఎయిర్లైన్కు అవసరమైన కీలక మౌలిక సదుపాయాలను అందిస్తాయి. రన్వేలు, పార్కింగ్ బేలు, బోర్డింగ్ గేట్లు, టెర్మినల్స్, ప్రయాణికుల సేవలు అన్నీ ఎయిర్పోర్ట్ నిర్వహణలోనే ఉంటాయి. ప్రతి ఎయిర్లైన్ తన రోజువారీ కార్యకలాపాల కోసం ఈ సదుపాయాలపై ఆధారపడుతుంది. అలాంటి పరిస్థితిలో ఒకే కంపెనీ ఎయిర్పోర్ట్తో పాటు ఎయిర్లైన్స్ బిజినెస్ కూడా చేస్తే నిష్పక్షపాత పోటీ దెబ్బతినే అవకాశం ఉందని విమానయాన సంస్థలు భావిస్తున్నాయి.
విమానయాన సంస్థల అభిప్రాయం ప్రకారం.. ఎయిర్పోర్ట్ యజమాని తన సొంత ఎయిర్లైన్కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. టెర్మినల్ సౌకర్యాలు, పార్కింగ్ స్థలాలు, బోర్డింగ్ గేట్లు, ఇతర సర్వీస్ కేటాయింపులో తన సంస్థకు ప్రాధాన్యం ఇస్తారనే అనుమానాలు ఉన్నాయి. దీని వల్ల ఇతర ఎయిర్లైన్స్కు నష్టం జరిగే అవకాశముందని వారు వాదిస్తున్నారు.
ఇండిగో మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ భాటియా ఈ అంశాన్ని తీవ్రమైన ప్రయోజనాల సంఘర్షణగా అభివర్ణించారు. ఎయిర్పోర్ట్లు అన్ని ఎయిర్లైన్స్కు సమానంగా సేవలు అందించే తటస్థ సంస్థలుగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఒక నగరంలో ఉన్న ఎయిర్పోర్ట్ను ఎయిర్లైన్స్ సులభంగా మార్చుకోలేవని, అందువల్ల నిష్పక్షపాతంగా వ్యవహరించడం అత్యంత అవసరమని తెలిపారు.
ఎయిర్ ఇండియా కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఎయిర్పోర్ట్లు స్వతంత్రంగా పనిచేయాలని సంస్థ పేర్కొంది. ఎయిర్పోర్ట్ మెయిన్టెనెన్స్, ఎయిర్లైన్ బిజినెస్ రెండూ ఒకే కంపెనీ చేతిలో ఉంటే ధరల నిర్ణయం, మౌలిక సదుపాయాల కేటాయింపు, పోటీ వంటి అంశాలపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపింది.
అదానీ ఎయిర్పోర్ట్స్ హోల్డింగ్స్ ఇప్పటికే ముంబై, అహ్మదాబాద్, లక్నో వంటి ప్రధాన విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. సంస్థ తన ఎయిర్పోర్ట్ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తోంది. ఒకవేళ అదానీ ఎయిర్లైన్స్ కూడా ప్రారంభిస్తే, ఇతర ఎయిర్లైన్స్ ప్రత్యక్ష పోటీదారుడి ఆధీనంలోని మౌలిక సదుపాయాలపై ఆధారపడాల్సి వస్తుందని విమానయాన సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
అదానీ ఎంటర్ప్రైజెస్ తాము ఎలాంటి ఎయిర్లైన్ వ్యాపారంలోకి ప్రవేశించే ప్రణాళికను పరిశీలించడం లేదని అధికారికంగా ప్రకటించింది. మీడియాలో వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమైనవని కంపెనీ స్పష్టం చేసింది. స్టాక్ ఎక్స్చేంజ్కు సమర్పించిన ప్రకటనలో కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో ప్రస్తుతం ఉన్న ఊహాగానాలకు కొంతవరకు తెరపడింది.
Also Read: సాహసం చేయబోతున్న ఫ్లిప్కార్ట్.. స్విగ్గీ, జొమాటో ఆధిపత్యానికి సవాల్
ఈ చర్చ కేవలం అదానీ గురించే కాదు. భవిష్యత్తులో ఎయిర్పోర్ట్ నిర్వహణ సంస్థలు ఎయిర్లైన్స్ను కూడా నిర్వహించడానికి అనుమతించాలా అనే విధానపరమైన ప్రశ్న ఇది. విమానయాన రంగంలో ఆరోగ్యకరమైన పోటీ కొనసాగాలంటే ఎయిర్పోర్ట్లు నిష్పక్షపాతంగా ఉండాలని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ అంశంపై భవిష్యత్తులో ఎయిర్పోర్ట్ నియంత్రణ కంపెనీలు స్పష్టమైన మార్గదర్శకాలు తీసుకురావచ్చు.