Fuel Prices: ఇంధన ధరల తగ్గింపు కోసం దేశవ్యాప్తంగా సామాన్యులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో, కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు దిగివస్తున్నా, దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లు ఎందుకు తగ్గడం లేదనే ప్రశ్నకు ఆయన స్పష్టతనిచ్చారు. వినియోగదారులకు ఈ తగ్గింపు ప్రయోజనాలు అందడానికి మరో 2 నుండి 3 నెలల సమయం పడుతుందని, చమురు సంస్థల ఆర్థిక పరిస్థితులను బట్టి ఈ నిర్ణయం ఉంటుందని ఆయన వివరించారు.
పాత నిల్వలు – ఖరీదైన ముడి చమురు భారం
ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ, దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) గతంలో కొనుగోలు చేసిన ఖరీదైన చమురు నిల్వలనే ఇంకా శుద్ధి చేస్తున్నాయని మంత్రి తెలిపారు. పశ్చిమ ఆసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో భారత్ భారీ ధరలకు క్రూడాయిల్ను ఆర్డర్ చేసింది. సాధారణంగా చమురు కంపెనీలు రెండు మూడు నెలల ముందే ఆర్డర్లు పెట్టుకుంటాయి కాబట్టి, ఆ పాత స్టాక్ పూర్తిగా అయిపోయాకే కొత్తగా తగ్గిన ధరల ప్రయోజనం మార్కెట్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.
రూ. 74,781 కోట్ల నష్టాల్లో చమురు కంపెనీలు
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు దాదాపు $120 కి చేరిన సమయంలో కూడా, దేశంలో సామాన్యుడిపై భారం పడకుండా ప్రభుత్వం ఇంధన ధరలను నియంత్రించింది. అయితే, దీనివల్ల ప్రభుత్వ రంగ చమురు సంస్థలు భారీగా నష్టపోయాయి. జూన్ 30 నాటికి ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకే ఇంధనాన్ని విక్రయించడం వల్ల ఈ కంపెనీలకు ఏకంగా రూ.74,781 కోట్ల మేర నష్టం వాటిల్లింది. సంక్షోభ సమయంలో ఈ కంపెనీలు రోజుకు దాదాపు రూ.2,400 కోట్ల నష్టాన్ని భరించి వినియోగదారులను కాపాడాయని మంత్రి గుర్తుచేశారు.
గ్లోబల్ సంక్షోభం – భారత్ చాకచక్యం
ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తినప్పటికీ, ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో ధరల పెరుగుదల చాలా స్వల్పంగానే ఉందని హర్దీప్ సింగ్ పూరి సమర్థించుకున్నారు. యుద్ధ సమయంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంధన ధరలు 20%, పొరుగు దేశాల్లో 35% పైగా పెరిగితే, భారత్లో మాత్రం కేవలం 5.58% మాత్రమే పెరిగాయి. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలు, దిగుమతి సుంకాల తగ్గింపు వల్లే దేశంలో ఎక్కడా ఇంధన కొరత లేకుండా, పెట్రోల్ బంకుల వద్ద క్యూ లైన్లు లేకుండా సరఫరాను నిరంతరాయంగా కొనసాగించగలిగామని ఆయన పేర్కొన్నారు.
ప్రైవేట్ సంస్థల ముందడుగు – ఊరట సంకేతాలు
ప్రభుత్వ రంగ సంస్థలు పాత నష్టాలను పూడ్చుకునే పనిలో ఉండటంతో ధరల సవరణకు మరికొంత సమయం తీసుకుంటుండగా, ప్రైవేట్ రంగ ఇంధన రిటైలర్ ‘నయారా ఎనర్జీ’ మాత్రం ఇప్పటికే తగ్గింపును ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ 7,000 పైచిలుకు స్టేషన్లలో పెట్రోల్పై లీటరుకు ₹5, డీజిల్పై రూ.3 చొప్పున తగ్గించి సామాన్యుడికి గుడ్ న్యూస్ చెప్పింది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం దేశీయంగా ప్రారంభమైందనడానికి ఇది ఒక సానుకూల సంకేతం. రాబోయే 2-3 నెలల పాటు అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు స్థిరంగా ఇలాగే తక్కువగా కొనసాగితే, ప్రభుత్వ రంగ సంస్థల నుండి కూడా లీటరుకు రూ.3 నుండి రూ.5 వరకు ధరలు తగ్గే అవకాశం ఉంది.
Also Read: కవిత అరెస్టు పర్వంలో పోలీస్ దాష్టీకం..! ఈడ్చుకెళ్లి.. రాళ్లపై పడేసి.. కారు డోరుకు ఢీకొట్టి..!