ఉద్యమకారుల భూపోరాటంలో పోలీసుల అత్యుత్సాహం బయటపడింది. వారి దాష్టీకానికి కవిత తీవ్ర గాయాలపాలయ్యారు. ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు పాటించకుండా.. రక్షణ లేకుండా.. ఆమెను బరబరా ఈడ్చుకెళ్లేందుకు ఉత్సాహం చూపారు. అసలే టైం ఇవ్వలేదు. ఇలా వచ్చి అలా ఆ ఆందోళనను భగ్నం చేసేందుకు హడావుడి చేసిన పోలీసులు.. కవితను అరెస్టు చేసే క్రమంలో వేసిన తప్పటడుగులు .. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర పోలీసుల దాష్టీకాలను తలపించాయి.
మహిళా కానిస్టేబుళ్లు కవితను చేతులతో ఆమాంతం ఎత్తుకెళ్లే క్రమంగా ఈడ్చుకెళ్లినట్టుగా తీసుకెళ్లారు. అక్కడ మొత్తం బండ రాళ్లున్నాయి. చాలా దూరం ఆమెను అలాగే తీసుకెళ్లారు. ఉద్యమకారులు, టీఆరెస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఆమెను అంతే హడావుడిగా తరలించాలని చూసిన పోలీసులు.. అక్కడే బండరాళ్లపై ఆమెను కింద పడేశారు.
ఆమె కింద పడిపోవడంతో లేపడానికి ప్రయత్నమేమీ జరగకపోగా.. చుట్టూ ఉన్న మహిళా పోలీసులు కూడా ఆమెపై అదుపు తప్పి పడిపోయారు. ఆ గుంపు కిందే ఆమె కొద్ది క్షణాల పాటు ఉండిపోయారు. ఆ తరువాత ఆమెను బయటకు లాగి… కనీసం కొంచెం సేపు కూడా సేద తీరనివ్వలేదు. అదే ఊపుతో.. అంతే హడావుడిలో తరలించే క్రమంలో కారు వద్దకు బరబరా లాక్కెళ్లారు.
పోలీస్ కారులో ఆమెను ఎక్కించేందుకు వేగంగా తీసుకురావడం.. అప్పటికే ఓపెన్ చేసి ఉన్న కారు డోర్కు ఆమె అదే స్పీడ్తో గుద్దుకున్నారు. అయినా ఆమెను వదల్లేదు పోలీసులు. లోపలికి బలవంతంగా నెట్టేశారు. కొంచెం తనకు టైం ఇవ్వాలని కవిత సైగలు చేసినా.. అక్కడున్న పోలీసులు ఆమెను పట్టించుకోలేదు. బలవంతంగా లోపల పడేసిన తరువాత గానీ శాంతించలేదు ఆ పోలీసు బలగం.
ఇవన్నీ వీడియోల్లో రికార్డయ్యాయి. సోషల్ మీడియాలో టీఆరెస్ శ్రేణులు ఈ వీడియోలను వైరల్ చేశారు. పోలీసుల ప్రతి చర్యా అందులో స్పష్టంగా కనిపిస్తున్నది. కవితను అరెస్టు చేసి బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. పలు సెక్షన్లపై కేసులు నమోదు చేసిన పోలీసులు ఆమెను సాయంత్రం వదిలేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
పోలీసుల చర్యపై ఆమె సీఎంను, డీజీపీ వైఖరిపై మండిపడ్డారు. మహిళలను ఈ విధంగా ఈడ్చుకెళ్లి అరెస్టు చేయడం పట్ల ఆమె తీవ్రంగా విమర్శించారు. ఉద్యమకారులపై లాఠీలు విరిగేలా కొట్టించి, రక్తం చిందించేలా చేసిన కాంగ్రెస్ సర్కార్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యిందన్నారు. మీకు చేతగాకపోతే ఎందుకు హామీలిచ్చారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు నెరవేరేంత వరకు వదిలేదన్నారు.
ఆరు గ్యారెంటీల్లో అర గ్యారెంటీ కూడా అమలు చేయని చేతగాని ప్రభుత్వమని విమర్శించారు కవిత. కానిస్టేబుళ్ల న్యాయమైన డిమాండ్ను కూడా పరిష్కరించాలని, క్యాబినెట్ మీటింగులో ఈ విషయాలపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. మహిళలపై, తనపై ఇంత కర్కశంగా పోలీసులు దాడి చేసినా.. మహిళా మంత్రులు గానీ, బీఆరెస్, కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు గానీ స్పందించకపోవడం దారుణమన్నారు. వారు ఉద్యమకారులు కాదా? వారిని ఎందుకు మీరు పట్టించుకోరు.. మేము అండగా ఉంటే.. మాపై దాడులు.. వారిపై నిర్లక్ష్యపూరిత వైఖరా..? అని నిలదీశారు కవిత.