Indians Retirement Planning| భారతదేశంలో మధ్య తరగతికి ప్రజలు ఎక్కువ శాతంలో ఉన్నారు. వీరంతా చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్నపాటి వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. రిటైర్మెంట్ అంటే చాలా దూరంలో ఉన్న విషయం అని చాలామంది 30 ఏళ్ల వయసులో భావిస్తారు. కానీ ఆర్థిక ప్రణాళికను ఆలస్యం చేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురుకావచ్చు.
మిరే అసెట్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ వైస్ చైర్మన్ సీఈఓ స్వరూప్ మొహంతి కూడా ఇదే విషయంపై హెచ్చరించారు. ఉద్యోగులు 35 ఏళ్ల వయసులోనే తమ రిటైర్మెంట్ అవసరాల గురించి ఆలోచించడం ప్రారంభించాలని ఆయన సూచించారు.
ఉద్యోగ విరమణ తర్వాత నెలవారీ జీతం ఆగిపోతుంది. అయితే ఇంటి ఖర్చులు, వైద్య ఖర్చులు, ఇతర అవసరాలు మాత్రం కొనసాగుతాయి. రిటైర్మెంట్ తర్వాత మన జీవితం కోసం పనిచేసే సమయంలో కూడబెట్టిన డబ్బుపైనే ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటుంది. తగినంత పొదుపు లేకపోతే వృద్ధాప్యంలో ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. అందుకే సగటు మధ్య తరగతి భారతీయుడు రిటైర్మెంట్ దగ్గరపడుతోందనే ఆలోచనతోనే భయపడుతున్నట్లు ఇటీవల ఒక అధ్యయనంలో తేలింది. ఈ ఆర్థిక ఒత్తిళ్లు ఎదుర్కోవాలంటే భవిష్యత్తు కోసం ముందస్తుగానే సిద్ధపడడమే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.
దీర్ఘకాలిక పెట్టుబడుల్లో సమయం చాలా కీలకం. చిన్న వయసులో పెట్టుబడులు ప్రారంభిస్తే డబ్బు పెరగడానికి ఎక్కువ సమయం లభిస్తుంది. కంపౌండింగ్ ప్రభావం వల్ల పెట్టుబడిపై వచ్చే రాబడులు కూడా కాలక్రమంలో మరింత రాబడిని అందించగలవు. స్వరూప్ మొహంతి.. ఉదాహరణగా రూ.10 కోట్ల లక్ష్యాన్ని సూచించారు. 20 ఏళ్ల వయసులో ప్రారంభిస్తే నెలకు సుమారు రూ.10,000 నుంచి రూ.20,000 పెట్టుబడి అవసరం కావచ్చు. అదే లక్ష్యాన్ని 40 ఏళ్ల వయసులో ప్రారంభిస్తే నెలకు దాదాపు రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి రావచ్చు. అయితే రాబడి, పెట్టుబడి విధానం, పన్నులు ఆధారంగా మీ లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి.
35 ఏళ్ల వయసులో పెట్టుబడులు ప్రారంభించడం ఆలస్యం కాదని మొహంతి చెబుతున్నారు. అయితే ఇకపై నిర్ణయాన్ని వాయిదా వేయకూడదు. ముందుగా మీ ఆదాయం, ఖర్చులు, ఆర్థిక లక్ష్యాలు, రిస్క్ తీసుకునే సామర్థ్యాన్ని అర్థం చేసుకోవాలి. అవసరమైతే అర్హత కలిగిన ఆర్థిక సలహాదారుడి సహాయం తీసుకోవచ్చు.
రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే కేవలం పెట్టుబడులు, పొదుపుల గురించి మాత్రమే కాదు. వయసు పెరిగే కొద్దీ వైద్య ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. తగిన ఆరోగ్య బీమా లేకపోతే తీవ్రమైన అనారోగ్యం కారణంగా సంవత్సరాల పొదుపు ఒక్కసారిగా ఖర్చయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే రిటైర్మెంట్కు ముందే ఆరోగ్య బీమా కవరేజీని సమీక్షించుకోవడం మంచిది.
Also Read: E20 వల్ల సమస్య.. మళ్లీ E10 తప్పనిసరి.. కేంద్ర ప్రభుత్వం సలహాదారు కీలక వ్యాఖ్యలు
రిటైర్మెంట్ కోసం భారీ మొత్తాన్ని కూడబెట్టిన తర్వాత కూడా కొంతమందిలో ఆర్థిక భయం కొనసాగుతుంది. రిటైర్మెంట్ స్ట్రాటజిస్ట్ మిలింద్ దేవగావ్కర్ ప్రకారం.. తమ పొదుపులను ఎంతవరకు ఖర్చు చేయవచ్చో చాలామందికి స్పష్టత ఉండదు. దీంతో కొందరు ప్రయాణాలను రద్దు చేసుకుంటారు. మరికొందరు తక్కువ ఖర్చుతో వసతులను ఎంచుకుంటారు. కొందరు ఆరోగ్య పరీక్షలను కూడా వాయిదా వేస్తారు.
Also Read: పెళ్లిళ్లు, పార్టీలలో పిల్లలు ఉంటే ఎంజాయ్ చేయలేకపోతున్నారా? ఇదిగో వెడ్డింగ్ బేబీసిట్టింగ్ సర్వీస్
వృద్ధాప్యంలో అవసరమయ్యే ఖర్చులు, ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చులను ముందుగానే అంచనా వేయాలి. పెట్టుబడులను కూడా కాలానుగుణంగా సమీక్షించాలి. రిటైర్మెంట్ను దూరమైన లక్ష్యంగా కాకుండా దీర్ఘకాలిక ఆర్థిక ప్రాధాన్యతగా భావించడం భవిష్యత్తులో ఆర్థిక భద్రతకు ఉపయోగపడుతుంది.