రేవంత్ తన సొంత టీమ్ను ప్రోత్సహిస్తున్నాడు. వారికే టికెట్లిచ్చాడు. వారిని గెలిపించుకున్నాడు. ఇది పాత కాంగ్రెస్ నేతలకు మింగుడు పడని అంశంగా మారింది. అప్పటి పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలుస్తుందా లేదా? అనే అనుమానాల నేపథ్యంలో మిన్నకుండి పోయారు.
కానీ అధికారం వచ్చిన తరువాత కూడా తమను పట్టించుకోకపోవడంతో పదవుల కోసం కొందరు, ఉనికి కోసం మరికొందరు రెబల్ గొంతులు విప్పుతున్నారు. కోమటరెడ్డి రాజగోపాల్రెడ్డి నుంచి మొదలైంది ఈ బెదిరింపు దోరణి. కాంగ్రెస్ పార్టీని, అధిష్టానాన్ని విమర్శించడం లేదు వీళ్లు.. రేవంత్ను సింగిల్గా టార్గెట్ చేస్తున్నారు. అధికారంలోకి తెచ్చాడు బాగానే ఉంది.. కానీ మా బాగును ఎందుకు పట్టించుకోవడం లేదు? ఆయన గ్రూపును పెంచి పోషించుకుంటున్నాడు.. అనే నిలదీతలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. తనకు మంత్రి పదవి ఇవ్వడం లేదనే కోపంతో కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి సర్కార్ ఏర్పడిన ఏడాది నుంచే రేవంత్ను బెదిరిస్తూనే ఉన్నాడు.
సీఎం కుర్చీనే లాక్కుంటా..అనే దాకా పోయింది పరిస్థితి. అయినా రేవంత్ వినలేదు. కనీసం పిలిచి చర్చించలేదు. అధిష్టానం కూడా జోక్యం చేసుకోలేదు. కోమటిరెడ్డి మాత్రం తన రెబల్ గొంతును ఇంకా బలంగా వినిపిస్తూనే ఉన్నాడు. బీజేపీలోకి తన బలగంతో పోతున్నాననే సంకేతమిస్తున్నాడు. పార్టీ మారిన పోచారం శ్రీనివాస్రెడ్డి కూడా బెదిరింపు రాజకీయాలకు దిగాడు. నిధులు ఇస్తామని ఇవ్వడం లేదని, ఎవరూ పట్టించుకోవడం లేదని రోడ్డెక్కినంత పని చేశాడు. చిన్నారెడ్డి తన టికెట్ను రేవంత్ అమ్ముకున్నాడని ఆరోపించారు.
తనూ మరో జీవన్రెడ్డిలా మారాలా? అంటూ బెదిరిస్తున్నాడు. జీవన్రెడ్డి పార్టీ మారి.. ఇప్పుడు రోజుకో ప్రెస్మీట్ పెడుతున్నాడు.. రేవంత్ను తుక్కు తుక్కు తిట్టేందుకు. మొన్నటికి మొన్న విజయశాంతి కూడా తన మంత్రి పదవి కోసం రెబల్ గళం వినిపించారు. పోక్సో కేసుల విషయంలో సర్కార్ ఉదాసీనంగా ఉంటున్నదని పరోక్షంగా రేవంత్రెడ్డిని విమర్శించారామె. ఇక తాజాగా మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత మరోసారి రేవంత్ను నేరుగా టార్గెట్ చేశారు. గతంలో బీసీల గొంతు నొక్కుతున్నారని రేవంత్ను విమర్శించిన ఆమె.. ఇవాళ తాజాగా పరకాల టికెట్ తనకు ఇవ్వకుండా వేరొకరికి ఇస్తానని ఎలా చెబుతారంటూ సీఎంను టార్గెట్ చేశారు.
తను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ప్రకటించిన ఆమె.. తన తండ్రి కొండా మురళికి ఎందుకు ఎమ్మెల్సీ ఇవ్వలేదని నిలదీశారు. మీ తమ్ముళ్ల బాగోతాలన్నీ బయటపెడతానని, తన జోలికి రావొద్దని అనడం రేవంత్తో తాడోపేడో తేల్చుకునేందుకేనని అర్థమవుతోంది. దానం నాగేందర్ లాంటి నేతలు అడపాదడపా బీఆరెస్ పాలనను మెచ్చుకోవడం మూలంగా రేవంత్ను ఇండైరెక్టుగా బెదిరించి లొంగదీసుకునే వ్యూహమేనంటున్నారు.
ఇలా వ్యక్తి కేంద్రంగా ఇప్పుడు రెబల్ వాయిస్ బలంగా వినిపిస్తోంది. ఇది బీఆరెస్కు బాగా కలిసి వస్తోంది. వారి చేతిలో ఆయుధంగా మారుతోంది. ఇప్పటికే కేటీఆర్, హరీశ్రావులు..కోమటిరెడ్డి, పోచారం శ్రీనివాస్రెడ్డి మాటలను కోట్ చేస్తూ మాట్లాడుతున్నారు. రేవంత్.. ఓ వైపు బలంగా ఉన్న ప్రతిపక్షం పై పోరాడుతున్నా.. . స్వపక్షంలో తనపై జరుగుతున్న దాడిని మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నాడు.