Bengaluru Cyber Crime: బీకామ్ డ్రాపవుట్ ఓ వ్యక్తి, తన తల్లితో కలిసి కోట్లు కొట్టేశాడు. స్కామర్లకు మ్యూల్ బ్యాంక్ అకౌంట్లు అందిస్తున్న తల్లీకొడుకులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. దుబాయ్కు చెందిన ఇండియన్ స్కామర్ కోసం వేలాది ఫేక్ అకౌంట్లను వీరిద్దరూ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు గానూ ఈ జంట ఏటా దాదాపు రూ.25 లక్షలు సంపాదిస్తున్నారు.
22 ఏళ్ల మహమ్మద్ ఉజైఫ్ తన తల్లి సబానా అబ్దుల్ బారితో కలిసి దాదాపు 4200 నకిలీ బ్యాంక్ ఖాతాలు సృష్టించి, వాటిని స్కామర్లకు అందించారు. అందుకుగానూ వీరి ఖాతాలకు సైబర్ నేరగాళ్ల నుంచి రూ.24 కోట్లు బదిలీ అయ్యాయని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. సైబర్ మోసాల నుంచి వచ్చిన డబ్బును మనీ లాండరింగ్ చేశారని గుర్తించారు. బెంగళూరు జేపీ నగర్ లోని ఓ ఖరీదైన అపార్ట్మెంట్కు నెలకు రూ.60 వేలు అద్దె చెల్లిస్తూ.. ఉజైఫ్, షబానా ఉంటున్నారు. ఉజైఫ్ ధరించే బూట్ల ధర రూ.లక్ష, చేతి వాచ్ విలువ రూ.15 లక్షల ఖరీదైంది. తల్లీకొడుకుల అక్రమ వ్యాపారాన్ని బెంగళూరు పోలీసులు బయటపెట్టారు. మ్యూల్ ఖాతాలను నిర్వహించడం, వాటి డెబిట్ కార్డులను ఉపయోగించి డబ్బులు డ్రా చేయడం, డబ్బులను దుబాయ్కు కొరియర్ చేయడంలో ఉజైఫ్ కు దిల్లీకి చెందిన తొమ్మిది మంది యువకులు సాయం చేశారు. వీరిని పోలీసులు అరెస్టు చేశారు.
ఉజైఫ్, అతడి తల్లి మరో తొమ్మిది మంది నిందితులతో కలిసి దాదాపు 9000 మ్యూల్ ఖాతాలను నిర్వహిస్తున్నారు. ఈ ఖాతాల్లో రూ.240 కోట్ల విలువైన లావాదేవీలను జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. బెంగళూరు సిటీ సీపీ సీమంత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. ఈ ముఠాకు దేశవ్యాప్తంగా 964 సైబర్ క్రైమ్ కేసులతో సంబంధం ఉందని గుర్తించామన్నారు. దుబాయ్లో ఉంటున్న భారతీయుడు ప్రేమ్ తనేజా సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని, అతను ఒక బుకీ అన్నారు. 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ముంబై పోలీసులు అతడ్ని అరెస్టు చేశారన్నారు. అయితే ప్రస్తుతం ప్రేమ్ తనేజా పరారీలో ఉన్నాడన్నారు.
నిందితుల నుంచి 242 డెబిట్ కార్డులు, 58 మొబైల్ ఫోన్లు, 531 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.4.9 లక్షల నగదు, ఖరీదైన తొమ్మిది వాచ్ లు, 33 చెక్ పుస్తకాలు, 21 పాస్బుక్లు, క్రిప్టోకరెన్సీ బుక్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతేడాది నవంబర్లో ఉజైఫ్, అతని తల్లి ప్రభుత్వ ఆసుపత్రులు, కాలేజీలకు వెళ్లి పేదలకు, విద్యార్థులకు రూ. 2,000-రూ. 5,000 కమిషన్ ఆశ చూపి వారి పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఈ పాస్ పుస్తకాలు, ఏటీఎంలను దిల్లీలోని తమ ముఠాకు అందించారు. ట్యాక్స్ ఎగవేతకు ఇతరుల పేరిట ఖాతాలు తెరుస్తున్న వ్యాపారవేత్తగా ఉజైఫ్ నటించాడు.
ఉజైఫ్ ఆన్లైన్ గేమింగ్లో ఎక్స్ఫర్ట్. డెవలపర్లను సంప్రదించిన వారికి పోటీ వస్తున్న గేమింగ్ యాప్ను బ్లాక్ చేయడానికి అనుచిత వ్యాఖ్యలు పోస్ట్ చేస్తూ.. నెలకు దాదాపు రూ. 20000 సంపాదించేవాడని పోలీసులు తెలిపారు. భారీ మొత్తంలో డబ్బులు రావాలంటే తనేజాను సంప్రదించాలని యాప్ నిర్వాహకులు తెలిపారు. ఇలా వీరి సైబర్ మోసాలు మొదలయ్యాయి.
Also Read: 547 కోట్లు సైబర్ స్కామ్.. ఖమ్మంలో ఇంటర్నేషనల్ సైబర్ ముఠా అరెస్ట్..
ఆ తర్వాత ఉజైఫ్, షబానా తమ దందాకు బెంగళూరుతో పాటు దేశంలోని కీలక నగరాల్లోని ఆస్పత్రులకు వచ్చే పేదలను లక్ష్యంగా చేసుకున్నారు. వారికి కమిషన్ ఆశచూపి వారి పేరిట బ్యాంకు ఖాతాలు, రెండేసి సిమ్కార్డులు తీసుకునేవారు. వాటిని సైబర్ నేరగాళ్లకు అందించి బెట్టింగ్లు, క్రిప్టోకరెన్సీ లావాదేవీలు చేసేవారు. బెట్టింగ్ డబ్బులను ఈ ఖాతాల్లోకి మళ్లించేందుకు షబానా దుబాయ్ వెళ్లేది. ఉజైఫ్ మన దేశంలోని పలు ప్రాంతాల్లో ఆ డబ్బును డ్రా చేస్తాడు. అందులో తమ వాటా తీసుకుని, మిగిలినదాన్ని ఇతరులకు కమీషన్గా ఇచ్చేవాడు. ఇలా రెండేళ్లలో రూ.204 కోట్ల అక్రమ లావాదేవీలు చేశాడు.