Hyderabad Crime: డబ్బు చూస్తే ఎవరైనా ట్రాక్ తప్పుతారు. రకరకాల ఆలోచన వస్తుంటాయి. ఏటీఎం వాహనం డ్రైవర్ విషయంలో అదే జరిగింది? ఇంకెన్నాళ్లు డ్రైవర్ ఉద్యోగం చేస్తామని భావించాడు. ఏకంగా ఏటీఎంకి క్యాష్ తీసుకెళ్తున్న వాహనం డ్రైవర్, ఏకంగా 57 లక్షల రూపాయలతో పరారయ్యాడు. సంచలనం రేపిన ఈ ఘటన హైదరాబాద్ ఐటీ కారిడార్ లోని గచ్చి బౌలి ప్రాంతంలో వెలుగుచూసింది.
హైదరాబాద్ సిటీలో పట్టపగలు ఏటీఎం వ్యాన్ నగదు చోరీ
దేశవ్యాప్తంగా ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్లు చోరీకి పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. హైదరాబాద్లో ఎక్కువగా జరుగుతున్న సందర్భలు లేకపోలేదు. తాజాగా అలాంటి ఘటన ఒకటి హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ ప్రాంతం గచ్చిబౌలిలో వెలుగు చూసింది. పట్టపగలు ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవరు రూ.57 లక్షలతో పరారైన ఘటన గోపనపల్లిలో బయటపడింది.
యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలలో క్యాష్ మెయింటెనెన్స్ సర్వీస్-సీఎంఎస్ విధులు నిర్వహిస్తోంది సంగం సెక్యూరిటీ సొల్యూషన్స్ సంస్థ. తిరుమలగిరిలో ఉంటున్న డ్రైవర్ అజిత్ కుమార్ అలియాస్ శివ, ఇద్దరు కస్టోడియన్లు రామకృష్ణ, మాలిక్, గార్డు పెరుమాల్ తో కలిసి ఏటీఎంలలో క్యాష్ లోడ్ చేసేందుకు సీఎంఎస్ వాహనంలో బయలుదేరారు.
రూ.57 లక్షలతో ఏటీఎం వాహనం డ్రైవర్ పరార్, గచ్చిబౌలిలో ఘటన
వాహనం నెంబర్ టీఎస్ 10 యూడీ 0393. గురువారం సాయంత్రం దాదాపు 4:45 గంటలకు గోపన్పల్లిలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో క్యాష్ లోడ్ చేసేందుకు ఇద్దరు కస్టోడియన్లు లోపలికి వెళ్లారు. గార్డు వాష్రూమ్కు వెళ్లడంతో ఇదే అదునుగా భావించాడు ఏటీఎం క్యాష్ వాహనం డ్రైవర్ అజిత్కుమార్. వ్యాన్లోని క్యాష్తో పరార్ అయ్యాడు.
ఏటీఎం నుంచి బయటకు వచ్చిన కస్టోడియన్లకు వాహనం కనిపించకపోవడంతో షాకయ్యారు. వెంటనే డ్రైవర్ అజిత్కు ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో చుట్టుపక్కల గాలించినా ప్రయోజనం లేకపోయింది. దీంతో 100 కు కాల్ చేసి పోలీసులకు సమాచారంఇచ్చారు. రంగంలోకి దిగిన గచ్చిబౌలి పోలీసులు జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా వాహనం తెల్లాపూర్ వైపు వెళ్లినట్లు గుర్తించారు.
ALSO READ: గర్భస్రావానికి ఒత్తిడి.. మనస్తాపంతో గర్భిణీ ఆత్మహత్యాయత్నం
అక్కడకు చేరుకోగానే వెంటేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఏటీఎం వాహనం కనిపించింది. నిందితుడు అజిత్కుమార్ వాహనాన్ని అక్కడ వదిలేసి అందులోని రూ. 57 లక్షల నగదుతో పరారైనట్లు పోలీసులు తెలిపారు. వాహనాన్ని స్వాదీనం చేసుకున్నారు పోలీసులు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో డ్రైవర్కు సిబ్బంది ఎవరైనా సహకరించారా? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న డ్రైవర్ను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.