Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ (AERA).. భోగాపురం ఎయిర్పోర్ట్కు సంబంధించిన తాత్కాలిక టారిఫ్ నిర్మాణానికి ఆమోద ముద్ర వేసింది. అయితే ఈ కొత్త విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన వెంటనే ప్రస్తుతం విశాఖపట్నంలోని నేవీ ఎయిర్ఫీల్డ్ నుండి నడుస్తున్న వాణిజ్య పౌర విమాన సర్వీసులు పూర్తిగా నిలిచిపోనున్నాయి.
భోగాపురం విమానాశ్రయం నుండి ప్రయాణించే వారిపై విశాఖతో పోలిస్తే అదనపు చార్జీల భారం పడనుంది. పాత ఎయిర్పోర్ట్లతో పోలిస్తే అత్యాధునిక మౌలిక వసతులు ఉన్నందున ఇక్కడ చార్జీలు కొంత ఎక్కువగా ఉండనున్నాయి. ఏఈఆర్ఏ ఖరారు చేసిన తాత్కాలిక యూజర్ డెవలప్మెంట్ ఫీజు వివరాల ప్రకారం.. భోగాపురం నుండి దేశీయంగా వేరే ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు రూ.835, ఇతర ప్రదేశాల నుంచి అక్కడికి చేరుకున్న వారికి రూ.355 ఛార్జీ విధించనున్నారు. అలాగే భోగాపురం నుంచి విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు రూ.1,255, ఇతర దేశాల నుంచి ల్యాండ్ అయ్యే వారికి రూ.545 రుసుము వసూలు చేయనున్నారు.
భోగాపురం విమానశ్రయ మౌలిక సదుపాయాలను వినియోగించుకునే విమానయాన సంస్థలకు సైతం విధించే ఛార్జీలను ఏఈఆర్ఏ ఖరారు చేసింది. దేశీయ విమానయన సంస్థలు.. విమానం టేకాఫ్ బరువులో ప్రతీ మెట్రిక్ టన్నుకు రూ.1400 చొప్పున ల్యాండింగ్ ఫీజు చెల్లించాలి. అలాగే అంతర్జాతీయ విమానయాన సంస్థలు ప్రతీ మెట్రిక్ టన్నుకు రూ.1,945 కట్టాల్సి ఉంటుంది. మరోవైపు భోగాపురం నుండి తమ కార్యకలాపాలను విస్తరించుకునే విమానయన సంస్థలకు ప్రోత్సహకాలు ఇవ్వాలని ఏఈఆర్ఏ నిర్ణయించింది.
ఎయిర్లైన్స్ సంస్థలు సరికొత్త రూట్లను ప్రారంభిస్తే ల్యాండింగ్ ఫీజులో 40% రాయితీ లభిస్తుంది. ఉన్న రూట్లలోనే అదనపు సర్వీసులు నడిపితే ల్యాండింగ్ ఫీజులో 20% రాయితీ ఇస్తారు. రాత్రి 11 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య ల్యాండ్ అయ్యే దేశీయ విమానాలకు కేవలం 25% ల్యాండింగ్ ఫీజు మాత్రమే వసూలు చేస్తారు. సరుకు రవాణా విమానాలకు ల్యాండింగ్ ఫీజు నుండి పూర్తి మినహాయింపు ఇచ్చారు.
Also Read: BSNL ఆల్ రౌండర్ ప్లాన్.. ఇదొక్కటి చాలు మామ.. 70 రోజులు తిరుగుండదు!
ఇదిలా ఉంటే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వాణిజ్య పరంగా ప్రారంభమైన మొదటి రోజు నుంచే విశాఖపట్నంలోని ప్రస్తుత విమానాశ్రయంలో పౌర విమాన సర్వీసులు పూర్తిగా నిలిపివేయబడతాయి. పౌర విమాన సర్వీసులు అన్నింటినీ భోగాపురానికే బదిలీ చేయనున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ ఇకపై కేవలం భారత నావికాదళం (Navy) అవసరాలకే పరిమితం కానుంది. దేశంలో దాదాపు 18 ఏళ్ల తర్వాత ఒక నగరంలో ఉన్న పాత ఎయిర్పోర్ట్ను పూర్తిగా మూసివేసి, కొత్త గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కు సర్వీసులు మార్చడం ఇదే మొదటిసారి. గతంలో 2008లో హైదరాబాద్ (బేగంపేట), బెంగళూరులలో ఇలా జరిగింది.
Also Read: ఇక చీపురుతో పనిలేదు.. రూ.5,000లోపే ఇల్లంతా క్లీన్ చేసే.. సూపర్ వాక్యూమ్ క్లీనర్స్!