Cyber Crime: పవిత్ర రంజాన్ మాసం సమీపించిన నేపథ్యంలో సైబర్ క్రిమినల్స్ సరికొత్త మోసాలకు తెర లేపారు. ఛారిటీ పేర జనం నుంచి డబ్బు కొల్లగొట్టే ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ అలర్ట్ గా ఉండాలని సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు హెచ్చరించారు. ఈనెల 19వ తేదీ నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నెలరోజులు మొత్తం మైనారిటీలు రోజా (ఉపవాస దీక్ష)లో ఉంటారు. కాగా, సంపన్నులు రంజాన్ మాసంలో విరివిగా దానధర్మాలు (జకాత్) చేస్తారు.
కొందరు నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తే మరికొందరు దుస్తులు ఇస్తారు. సరిగ్గా దీనినే సైబర్ కేటుగాళ్లు అవకాశంగా మలుచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. అనాధ పిల్లల ఆలనాపాలన, మసీదుల నిర్మాణం, అత్యవసర వైద్య సహాయం పేర నకిలీ వెబ్ సైట్లు ప్రారంభించారు. వాట్సాప్ మెసేజీలను పంపిస్తున్నారు. దీంతోపాటు గాజా బాధితులకు, రంజాన్ మాసం సందర్భంగా ఆహార పదార్థాల పంపిణీకి ఆర్థిక సాయం చేయాలని రిక్వెస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జాగ్రత్తగా ఉండాలని డీసీపీ అరవింద్ బాబు ప్రజలకు సూచించారు. ఆయా వెబ్ సైట్లు నమ్మదగ్గవేనా? అన్నది నిర్ధారించుకోవాలని చెప్పారు. సోషల్ మీడియా ద్వారా వచ్చే క్యూ ఆర్ కోడ్ లను స్కాన్ చేయవద్దన్నారు. తెలియని లింకులు, ఏపీకే ఫైళ్లు వస్తే వాటిని క్లిక్ చేయవద్దని చెప్పారు.
Also Read: Horror Movie OTT: తండ్రి కూతుర్లకు నరకం చూపించే రాక్షసి… సైలెంట్ సినిమా వైలెంట్ థ్రిల్లర్
ఇక, మరికొందరు సైబర్ క్రిమినల్స్ నకిలీ వెబ్ సైట్లు తయారు చేసి ఆన్ లైన్ లో షాపింగ్ చేయండి.. భారీ డిస్కౌంట్లు పొందండి అంటూ మోసాలకు తెర లేపారు. దుస్తులు, డ్రై ఫ్రూట్స్, ఖర్జురాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇఫ్తార్ విందు భోజనానికి కావాల్సిన సరుకుల పేర మెసెజీలు పంపిస్తున్నారు. ఈ వెబ్ సైట్ల బారిన పడి మోసపోవద్దని డీసీపీ అరవింద్ బాబు చెప్పారు.