Hyderabad Crime: పని చేస్తున్న ఇంటికే కన్నం వేసి కోట్ల రూపాయల సొత్తుతో ఉడాయించిన నేపాలీ దంపతులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 6 కోట్ల విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. గచ్చిబౌలి ప్రాంతంలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివాసం ఉంటున్న ప్రకాశ్ పారిశ్రామికవేత్త. నెల రోజుల క్రితమే నేపాలీ దంపతులు కమలా షాహీ, విమల్ షాహీ ఆయన ఇంట్లో పనికి చేరారు. కాగా, ఇటీవల ప్రకాశ్ కుటుంబంతో కలిసి ముంబై వెళ్లాడు. అదే అదునుగా కమలా షాహీ, విమల్ షాహీ ఇంట్లో నుంచి వజ్రాలు పొదిగిన బంగారు నగలు తస్కరించి పరారయ్యారు.
ముంబై వెళ్లిన ప్రకాశ్ కుటుంబం ఆదివారం ఇంటికి తిరిగి వచ్చింది. ఇంట్లో నేపాలీ దంపతులు కనిపించకపోవడంతో వెళ్లిపోయారని మొదట భావించారు. అయితే, లాకర్లో ఉన్న బంగారం మొత్తం చోరీకి గురైనట్లు గుర్తించిన ప్రకాశ్ గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు నిందితులను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. ఈ స్పెషల్ టీమ్స్ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, నేపాల్ సరిహద్దుల్లో నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టాయి.
Also Read: లోకేశ్, పవన్లపై గుడివాడ అమర్నాథ్ ఫైర్.. ‘కుక్కను కనకపు సింహాసనంపై కూర్చోబెడితే’..
చివరకు ఉత్తర్ప్రదేశ్ పోలీసుల సహకారంతో యూపీ-నేపాల్ సరిహద్దు వద్ద ఇద్దరు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.6 కోట్లు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వారిని హైదరాబాద్ తీసుకొస్తున్నారు. పూర్తి వివరాలను అధికారులు నేడు వెల్లడించే అవకాశాలున్నాయి.
Also Read: ఫ్రిజ్ కొంటున్నారా? సింగిల్ డోర్, డబుల్ డోర్, ఇన్వర్టర్ టెక్నాలజీలలో ఏది బెస్ట్?