Telugu states: తెలంగాణ, ఏపీలో పిడుగుపాటుకు ఆరుగురు చనిపోవడంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలంలో తీవ్ర విషాదం జరిగింది. పిడుగుపడి ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. భూమ్పురం గ్రామంలో తిమ్మప్ప అనే రైతు పొలంలో సీడ్ పత్తి క్రాసింగ్ పనులకు ఏడుగురు కూలీలు వెళ్లారు. సాయంత్రం వర్షం కురవడంతో కూలీలు అందరూ పొలంలో ఉన్న వేప చెట్టు కిందకు వెళ్లగా అదే సమయంలో ఉరుములు, మెరుపులతో చెట్టుపై పిడుగు పడింది. ఈ ఘటనలో సర్వేష్, పార్వతి, పులికల్ గ్రామానికి చెందిన సౌభాగ్యమ్మ అక్కడికక్కడే మరణించారు. గాయపడ్డ మరో నలుగురుని హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు.
ఖమ్మం జిల్లాలో పిడుగు పడి ఇద్దరు మృతి
మరోవైపు ఖమ్మం జిల్లాలోను పిడుగుపాటుకు గురై ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. సత్తుపల్లి మండలం పాకలగూడెం పంచాయతీ సత్యనారాయణపురంలో మహేశ్ పిడుగుపాటుకు గురై మరణించాడు. గ్రామ శివారులో గేదెలు మేపుతున్న క్రమంలో పిడుగు పడింది. దీంతో మహేశ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇది గుర్తించిన కొందరు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి అతన్ని సత్తుపల్లి ఆసుపత్రికి తరలించగా… అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
పొలం పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా మృతి
మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లిలో పిడుగుపడి రైతు మృతి చెందాడు. గడిపూడి వీరభద్రరావు తన పొలంలో పనిచేస్తుండగా… ఒక్కసారిగా ఆకాశంలో మబ్బులు కమ్ముకుని ఉరుములు, మెరుపులతో పెద్ద శబ్దంతో పిడుగు పడింది. దింతో రైతు వీరభద్రరావు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఆదిలాబాద్ జిల్లాలో పిడుగు పడి ముగ్గురు మృతి
ఆదిలాబాద్ జిల్లా పెంబి మండలంలో పిడుగుపాటుకు గురై ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. గుమ్మెన ఎంగ్లాపూర్ గ్రామానికి చెందిన భార్యాభర్తలు అలెపు ఎల్లయ్య, ఎల్లవ్వతో పాటు మరో వ్యక్తి బండారు వెంకటి అనే ముగ్గురు వ్యవసాయ పనులు ముగించుకొని తిరిగి వస్తుండగా పిడుగు పడడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రకాశం జిల్లా కట్టవారిపాలెంలో రైతు వెంకటేశ్వర్లు మృతి
ప్రకాశం జిల్లా కొండపి మండలంలో పిడుగుపాటుకు ఒకరు మృతి చెందారు. కట్టవారిపాలెనికి చెందిన బెజవాడ వెంకటేశ్వర్లు పొలం పనులు ముగించుకొని ఇంటికి తిరుగు వస్తుండగా పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు.
Also Read: పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి శవమైన తల్లి.. గుండెలు పగిలేలా ఏడుస్తున్న చిన్నారులు
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాలతో సహా పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.