ఢిల్లీ, ముంబై నగరాల్లో చోటుచేసుకున్న రెండు వేర్వేరు అమానవీయ ఘటనలు దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఢిల్లీలో ఒక జిమ్ యజమాని కుటుంబంపై సామూహిక దాడి జరగ్గా.. ముంబైలో చోరీ ప్రయత్నంలో ఒక మహిళపై వేధింపులకు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ రెండు దారుణ ఘటనలకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధానిలోని లక్ష్మీ నగర్ ప్రాంతంలో జనవరి 2న ఒక భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. ఒక జిమ్ యజమానిని కొట్టి అతని భార్యను వేధించడమే కాకుండా.. వారి కుమారుడిని బట్టలు విప్పి వీధిలో కొట్టిన ఉదంతం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. బాధితుడు తన ఇంటి బేస్మెంట్లో జిమ్ నిర్వహిస్తున్నాడు. గత కొంతకాలంగా జిమ్ కేర్టేకర్గా పనిచేస్తున్న సతీష్ యాదవ్ తనను మోసం చేసి.. వ్యాపారాన్ని ఆక్రమించుకోవాలని చూస్తున్నట్లు బాధితుడు ఆరోపించారు.
జనవరి 2న బేస్మెంట్లో నీటి లీకేజీని తనిఖీ చేయడానికి వెళ్లిన యజమాని దంపతులపై సతీష్ యాదవ్ తన అనుచరులతో కలిసి దాడికి దిగాడు. నిందితులు యజమానిని పిడిగుద్దులతో కొట్టి, అతని భార్య పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. గొడవ జరుగుతున్న విషయం తెలిసి అక్కడికి చేరుకున్న వారి కుమారుడిని నిందితులు పట్టుకుని.. వీధిలోకి ఈడ్చుకెళ్లి బట్టలు విప్పించి దారుణంగా కొట్టారు. ఈ దారుణ దృశ్యాలన్నీ సిసిటివి (CCTV) కెమెరాల్లో బయటపడ్డాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు సతీష్ యాదవ్ను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వికాస్ యాదవ్, శుభమ్ యాదవ్, ఓంకర్ యాదవ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మరోవైపు.. ముంబైలోని మలాడ్ (ఈస్ట్) కురార్ ఏరియాలో శుక్రవారం ఒక విస్తుపోయే ఘటన జరిగింది. 38 ఏళ్ల మహిళ ఇంట్లోకి చొరబడిన 25 ఏళ్ల యువకుడు, దొంగతనానికి ప్రయత్నించి విఫలమవ్వడంతో ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బాధితురాలు ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు బలవంతంగా లోపలికి ప్రవేశించి, తలుపులు గడియ పెట్టుకున్నాడు.
ఆమె నోరు మూసివేసి నగదు, మొబైల్ ఫోన్, ఏటీఎం కార్డు ఇవ్వాలని బెదిరించాడు. అయితే ఇంట్లో విలువైన వస్తువులు ఏమీ లేవని ఆమె చెప్పడంతో ఆగ్రహానికి గురైన నిందితుడు, ఆమెను బలవంతంగా ముద్దాడి వేధింపులకు గురిచేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కొద్ది గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. భారతీయ న్యాయ సంహిత (BNS) కింద కేసు నమోదు చేసిన పోలీసులు, తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ రెండు ఘటనలు నగరాల్లో సామాన్యుల భద్రతపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది. నేరగాళ్లు పగటిపూట కూడా బరితెగించి దాడులకు పాల్పడటం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.