Road Accidents: తెలంగాణ రాష్ట్రంలో శుక్రవారం వరుస రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రుక్మాపూర్లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. గ్రామానికి చెందిన తాటికొండ సాయికిరణ్, చిలుక ప్రవీణ్ బైక్పై వెళ్తుండగా వేగంగా వచ్చిన ఒక లారీ వారిని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు తీవ్ర గాయాలతో స్పాట్లోనే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న చొప్పదండి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సొంత ఊరిలోనే యువకులు మృతి చెందడంతో రుక్మాపూర్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
మరోవైపు హనుమకొండ జిల్లా హసన్పర్తి పెద్ద చెరువు వద్ద జరిగిన ప్రమాదంలో ఎస్సార్ (SR) ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఇద్దరు బీటెక్ విద్యార్థులు మృతి చెందారు. అక్రమ్, సుప్రతికలు బైక్పై వెళ్తుండగా.. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి కిందపడిపోయారు. సరిగ్గా అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన టిప్పర్ లారీ వారిపై నుంచి వెళ్లడంతో విద్యార్థులు నుజ్జునుజ్జు అయ్యారు. లారీ డ్రైవర్ భయంతో స్థానిక పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. మృతులు ఇద్దరూ ఈఈఈ (EEE) విభాగంలో చదువుతున్నారని పోలీసులు తెలిపారు. విద్యావంతులైన యువకులు ఇలా అకాల మరణం చెందడం ఆయా కళాశాలల్లో తీవ్ర వేదనను నింపింది.
హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
హసన్ పర్తి పరిధిలోని పెద్ద చెరువు సమీపంలో SR కాలేజ్ విద్యార్థులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టిన టిప్పర్ లారీ
సుప్రతీక, అక్రమ్ అనే ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతి pic.twitter.com/spgOGnZ3Sw
— ChotaNews App (@ChotaNewsApp) March 6, 2026
మహబూబ్నగర్ జిల్లా అడ్డాకుల మండలం పొన్నకల్ స్టేజి వద్ద మరో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డివైడర్ను దాటి అవతలి వైపునకు దూసుకెళ్లి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ రవి యాదవ్తో పాటు మరో వ్యక్తి మరణించారు. బస్సులోని పలువురు ప్రయాణికులు గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఒకే రోజు జరిగిన ఈ మూడు ప్రమాదాల్లో మొత్తం ఆరుగురు చనిపోవడం రహదారి భద్రతపై ఆందోళన కలిగిస్తోంది. అతివేగం, అజాగ్రత్తే ఈ ప్రాణనష్టాలకు ప్రధాన కారణాలని తెలుస్తోంది.
Read Also: పెళ్లి జరగాల్సిన ఇంట తల్లి దారుణ హత్య.. గొంతు కోసి చంపిన దుండగులు