War Impact on EV Cars: ప్రపంచ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ కార్ల వినియోగం పెరుగుతోంది. పెట్రో సమస్యలు, పర్యవరణ హితమైన ప్రయాణాల పట్ల ఆసక్తితో చాలా మంది ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేస్తున్నారు. అయితే, తాజాగా మధ్యప్రాచ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల మీద కూడా పడింది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో జరిగిన సంఘర్షణల కారణంగా, EV తయారీలో కీలకమైన అల్యూమినియం సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది.
ఎలక్ట్రిక్ వాహనాల నిర్మాణంలో ఉపయోగించే అల్యూమినియం సాధారణ లోహం కాదు. ఇది తక్కువ కార్బన్ ఉద్గారాలతో తయారయ్యే ప్రత్యేకమైన గ్రేడ్. ఈ లోహం ప్రధానంగా గల్ఫ్ దేశాల నుంచి సముద్ర మార్గం ద్వారా ప్రపంచానికి ఎగుమతి అవుతుంది. కానీ, ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా, ఈ సరఫరా దాదాపు నిలిచిపోయింది.
బహ్రెయిన్కు చెందిన ప్రముఖ అల్యూమినియం కంపెనీ ఆల్బా ఇప్పటికే ఫోర్స్ మేజర్ ప్రకటించి తన ఉత్పత్తిని సుమారు 19 శాతానికి తగ్గించింది. అలాగే, ఖతార్ లో గ్యాస్ ఉత్పత్తి నిలిచిపోవడంతో అక్కడి అల్యూమినియం తయారీ కూడా పూర్తిగా ఆగిపోయింది. ఈ ప్రభావం గ్లోబల్ ఆటోమొబైల్ పరిశ్రమపై నేరుగా పడింది. ఈ సరఫరా సమస్యల కారణంగా పలు ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఉత్పత్తిని తగ్గించాల్సి వచ్చింది. టయోటా రెండు నెలల్లో దాదాపు 40,000 వాహనాల ఉత్పత్తిని తగ్గించగా, నిస్సాన్ కూడా తన తయారీ షెడ్యూల్ ను మార్చుకుంది. BMW, మెర్సిడెస్ బెంజ్ లాంటి కంపెనీలకు సరఫరా చేసే గల్ఫ్ స్మెల్టర్లు కూడా ఒప్పందాలను నిలిపివేస్తున్నాయి.
గల్ఫ్ దేశాలు గత కొన్ని దశాబ్దాలుగా చమురు ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి బయటపడేందుకు అల్యూమినియం ఇండస్ట్రీనికి అభివృద్ధి చేశాయి. యూఏఈ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద అల్యూమినియం ఉత్పత్తిదారుగా ఎదిగింది. ఇప్పుడు రవాణా సమస్యల కారణంగా అల్యూమినియంను ట్రక్కుల ద్వారా ప్రత్యామ్నాయ మార్గాల్లో తరలిస్తున్నారు. అయితే, ఖర్చు విపరీతంగా పెరుగుతోంది. యుద్దం కారణంగా అల్యూమినియం ధరలు భారీగా పెరిగాయి. పరిస్థితి మారకపోతే మరింత పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల్లో సాధారణ కార్లతో పోలిస్తే సుమారు 40 శాతం ఎక్కువ అల్యూమినియం ఉపయోగిస్తారు. ఈ లోహం కొరత EV తయారీ కంపెనీలకు పెద్ద సమస్యగా మారింది. అంతేకాదు, EV బ్యాటరీల తయారీలో ఉపయోగించే సల్ఫర్ సరఫరా కూడా ఇదే మార్గంపై ఆధారపడటం వల్ల తీవ్రంగా ఎఫెక్ట్ అవుతోంది. అటు ఆయిల్ ధరలు పెరగడం వల్ల పెట్రోల్ వాహనాల మెయింటెనెన్స్ ఖర్చు కూడా పెరుగుతోంది. మొత్తంగా యుద్ధం ప్రభావం విద్యుత్ తో పాటు పెట్రో వాహనాలపై భారీగా పడుతోంది.
Read Also: ఎలక్ట్రిక్ vs పెట్రోల్ స్కూటర్.. ఏది కొంటే సేవింగ్ ఎక్కువ?