East Godavari Accident: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక వైద్య విద్యార్థిని ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అయితే చదువు పూర్తి చేసుకుని కెరీర్లో స్థిరపడాల్సిన తరుణంలో జరిగిన ఈ ఘటన ఆ కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది.
ఈ ప్రమాదానికి గురైన వారు రాజమహేంద్రవరం సమీపంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో దంత వైద్య విద్య (BDS) పూర్తి చేసి, ప్రస్తుతం ఇంటర్న్షిప్ చేస్తున్నారు. చాగల్లుకు చెందిన జొన్నకూటి లిఖిత (23), తునికి చెందిన వాత్సల్య సాయి, విశాఖకు చెందిన జాహ్నవి రాజేశ్వరి రాజానగరంలోని ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్నారు. వీరి ఇంటర్న్షిప్ మరో పది రోజుల్లో ముగియాల్సి ఉండగా, ఈ లోపే మృత్యువు కబళించింది.
అయితే ఘటన జరిగిన సమయంలో విద్యార్థులంతా తమ స్నేహితుడు కిశోర్తో కలిసి రాజమహేంద్రవరం నుంచి కారులో హాస్టల్కు తిరిగి వెళ్తున్నారు. దివాన్చెరువు – రాజానగరం మధ్యలో ప్రయాణిస్తుండగా, వీరి కారు ముందు వెళ్తున్న ఒక గుర్తుతెలియని వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఆ వేగానికి కారు అదుపు తప్పి రోడ్డు మధ్యలోని డివైడర్ను ఎక్కి నిలిచిపోయింది.
ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా జరిగిందంటే, ముందు సీట్లో కూర్చున్న లిఖిత కారు బానెట్ భాగం మధ్యలో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మరణించారు. ఆమె మృతదేహాన్ని వెలికితీయడానికి స్థానికులు, పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కారు నడుపుతున్న కిశోర్తో పాటు మిగిలిన ఇద్దరు విద్యార్థినులకు తీవ్ర గాయాలు కావడంతో వారిని వెంటనే చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించారు.
Also Read: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లో ఇద్దరు మృతి!
మరో పది నిమిషాల్లో క్షేమంగా బసకు చేరుకుంటామన్న సమయంలో ఈ విపత్తు సంభవించడం స్థానికులను కలచివేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. ప్రమాదానికి గల కారణాలపై విచారణ చేపట్టారు.