Cash in Washing Machine: ఆన్లైన్ లావాదేవీలు వచ్చిన తర్వాత క్యాష్ కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. ఒకవేళ ఉన్నా తక్కువ మొత్తంలో ఉండేది. ఒకవేళ నగదు ఉన్నా.. బీరువాలు లేదా లాకర్లలోనే ఉండేది. కానీ వాషింగ్ మెషిన్లో నోట్ల కట్టలు దర్శనమిచ్చేసరికి అధికారులు అవాక్కయ్యారు. ఇంతకీ ఎక్కడ అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.
విదేశీ మారక ద్రవ్య నిబంధనల ఉల్లంఘన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్-ఈడీ ముఖ్యమైన ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్కతా, హర్యానా వంటి నగరాల్లో సోదాలు చేపట్టింది. ఈ తనిఖీల్లో భారీ ఎత్తున నగదు పట్టుబడింది. క్యాప్రికార్నియన్ షిప్పింగ్ కంపెనీకి చెందిన ఆఫీసుల్లో ఈడీ ఏకకాలంలో సాదాలు చేపట్టింది. ఈ క్రమంలో వాషింగ్ మెషిన్లో ఉంచిన రెండున్నర కోట్ల రూపాయలను చూసి షాకయ్యారు. ఇవికాకుండా డాక్యుమెంట్లు, హార్డ్ డిస్కులను స్వాధీనం చేసుకుంది.
దాదాపు రూ. 1800 కోట్ల మేర సింగపూర్ కంపెనీలకు అక్రమ చెల్లింపులు చేసినట్టు క్యాప్రికార్నియర్ షిప్పింగ్ కంపెనీపై ఆరోపణల నేపథ్యంలో దాడులకు దిగింది ఈడీ. ఈ విషయాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్వయంగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా క్యాప్రికార్నియన్ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ లిమిటెడ్, లక్ష్మీటన్ మారిటైమ్, హిందుస్థాన్ ఇంటర్నేషనల్, రాజనందిని మెటల్స్ లిమిటెడ్, స్టావర్ట్ అల్లాయ్స్ ఇండియా ప్రైవేటు లిమిటెచ్, భాగ్యనగర్ లిమిటెడ్, వినాయక స్టీల్స్ లిమిటెడ్, వశిష్టం కన్స్ట్రక్షన్స్ తోపాటు పలు కంపెనీలు, వాటి డైరెక్టర్ల ఆఫీసులు, ఇళ్లలో సాదాలు నిర్వహించింది.
ఆయా కంపెనీల డైరెక్టర్లు విజయకుమార్ శుక్లా, సంజయ్ గోస్వామి, సందీప్గార్గ్, వినోద్ కేడియాతోపాటు పలువుర్ని ప్రశ్నించింది ఈడీ. సోదాల్లో అనుమానంగా ఉన్న పత్రాలు, డిజిటల్ వస్తువులు స్వాధీనం చేసుకుంది. అలాగే నగదు తరలింపులో ప్రమేయమున్న ఉన్న సంస్థలకు సంబంధించి 47 బ్యాంకు అకౌంట్లను సీజ్ చేసింది. ముఖ్యంగా క్యాప్రికార్నియన్ షిప్పింగ్ కంపెనీ దాని అనుబంధ సంస్థలు ఫెమా చట్టాన్ని ఉల్లఘించి బోగస్ కంపెనీల సాయంతో అనుమానాస్పద లావాదేవీలు జరిపినట్లు సమాచారం అందడంతో ఈ సోదాలు చేపట్టింది. అయితే సోదాలు ఎప్పుడు జరిగాయి? ఆ నగదు ఎక్కడ పట్టుబడిందనే వివరాలను మాత్రం వెల్లడించలేదు.