Digital Arrest Scam: స్వేఛ్చ బ్యూరో: సీనియర్ సిటిజన్ ను టార్గెట్ గా చేసుకుని డిజిటల్ అరెస్ట్ పేర 1.07కోట్ల రూపాయలు కొల్లగొట్టిన ముగ్గురు కీలక నిందితులను సైబర్ కేటుగాళ్లను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైం డీసీపీ అరవింద్ బాబు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ లో నివాసముంటున్న 62ఏళ్ల వృద్ధునికి అక్టోబర్ 16న ఫోన్ చేసిన అగంతకులు తమను తాము ముంబయి క్రైం బ్రాంచ్ అధికారులమని పరిచయం చేసుకున్నారు. బాధితున్ని నమ్మించటానికి పోలీస్ యూనిఫాం దుస్తుల్లో వాట్సాప్ వీడియో కాల్ చేసి మాట్లాడారు. నీ ఫోన్ నెంబర్, ఆధార్ కార్డు చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో ఉపయోగించబడ్డాయని బెదరగొట్టారు. అరెస్ట్ చేయటానికి త్వరలోనే హైదరాబాద్ వస్తున్నామని చెప్పి అప్పటి వరకు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్టు చెప్పారు.
ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకుగానీ.. బంధుమిత్రులకుగానీ చెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించారు. మనీ లాండరింగ్ కేసు కూడా ఉందని చెప్పి బాధితుని బ్యాంక్ అకౌంట్లో ఉన్న నగదు, ఫిక్స్ డ్ డిపాజిట్లు ఇతర వివరాలు తెలుసుకున్నారు. ఆ తరువాత విచారణ పూర్తి కాగానే తిరిగి ఇచ్చి వేస్తామని వేర్వేరు బ్యాంకు ఖాతాల్లోకి 1.08కోట్ల రూపాయల నగదును ట్రాన్స్ ఫర్ చేయించారు. ఆలస్యంగా మోసపోయినట్టు గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసులు నమోదు చేసిన ఇన్స్ పెక్టర్ కే.ప్రసాదరావు, ఏసీపీ శివమారుతి పర్యవేక్షణలో దర్యాప్తు ప్రారంభించారు.
Also Read: Action Thriller OTT : ఒకే అమ్మాయితో ఏడుగురు… శవంతో కాపురం… రక్తాన్ని మరిగించి రివేంజ్ డ్రామా
పక్కాగా ఆధారాలు సేకరించి కేసులో నిందితులుగా ఉన్న మనీ ఎక్స్ ఛేంజ్, ట్రావెల్స్ వ్యాపారి గుర్దీప్ సింగ్ ఎలియాస్ లక్కీ నారంగ్ (42), ఆర్వో టెక్నీషియన్ హర్ ప్రీత్ సింగ్ ఎలియాస్ కరణ్ కౌషిక్ (30), కుమార్ మోహిత్ ఎలియాస్ మోహిత్ కౌషిక్ (30)లను అరెస్ట్ చేశారు. నిందితులు ఢిల్లీ, జైపూర్ తదితర నగరాలకు వెళుతూ హోటళ్లలో బస చేసి కమీషన్ ఆశ చూపించి ఇతర బ్యాంకు ఖాతాల వివరాలను సేకరిస్తూ వచ్చినట్టుగా దర్యాప్తులో వెల్లడైందని డీసీపీ అరవింద్ బాబు తెలిపారు. తమ వలలో చిక్కిన వారి నుంచి ఆ ఖాతాల్లోకి డబ్బు ట్రాన్స్ ఫర్ చేయిస్తారన్నారు. ఒకసారి నగదు జమ కాగానే ప్రధాన సూత్రధారికి బదిలీ చేస్తారని చెప్పారు. దీని కోసం భారీ మొత్తాల్లో కమీషన్లు తీసుకుంటూ వస్తున్నారన్నారు. అరెస్ట్ చేసిన నిందితులకు గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో జరిగిన పలు సైబర్ కేసులతో సంబంధం ఉన్నట్టుగా చెప్పారు.
Also Read: Mahadevappa Suicide: బీజేపీ కార్యకర్త ఆత్మహత్యతో.. అట్టుడికిన డీజీపీ ఆఫీస్..?