Hyderabad: హైదరాబాద్లోని మాదాపూర్ దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నాగోల్ ప్రాంతానికి చెందిన రోజా రమణి (26) అనే యువతి కేబుల్ బ్రిడ్జి పైనుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె మాదాపూర్లోని మెడికవర్ ఆసుపత్రిలో అకౌంటెంట్గా పని చేస్తోంది. రోజా రమణి ఒక్కసారిగా కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించగా, ఆమె దుర్గంచెరువులోకి దూకిన దృశ్యాలు బయటపడ్డాయి.
అయితే, ఈ ఘోర నిర్ణయానికి గల కారణాలపై పోలీసులు ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. లోన్ రికవరీ ఏజెంట్ల వేధింపులు తాళలేకే ఆమె ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు బలంగా అనుమానిస్తున్నారు. అప్పుల వసూళ్ల పేరుతో ఏజెంట్లు పెట్టిన మానసిక క్షోభే యువతి ప్రాణం తీసుకోవడానికి కారణమని తెలుస్తోంది. ఒక యువతి ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోవడంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు.
Also Read: ఉపాధి కూలీలకు ‘గుండు’ గండం.. యాప్లో విచిత్ర సమస్య!