Student Suicide: ఇబ్రహీంపట్నంలోని శ్రీ ఇందు ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం మొండివైఖరి ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ప్రణీత్ కుమార్ అనే విద్యార్థి, కాలేజీ సిబ్బంది వేధింపులు భరించలేక ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది.
రెండు నెలల క్రితం జరిగిన ప్రమాదంలో ప్రణీత్ కాలుకు తీవ్ర గాయమైంది. దీంతో అతను కాలేజీకి హాజరుకాలేకపోయాడు. కోలుకున్న తర్వాత మెడికల్ సర్టిఫికెట్తో కాలేజీకి వెళ్లగా, అటెండెన్స్ తక్కువగా ఉందన్న సాకుతో యాజమాన్యం అతనిపై కనికరం చూపలేదు. కండోనేషన్ ఫీజు కట్టాలని ఒత్తిడి చేయడమే కాకుండా, తల్లిదండ్రులు వస్తే తప్ప పరీక్షకు అనుమతించబోమని తెగేసి చెప్పారు.
అంతేకాకుండా, కాలు నొప్పితో బాధపడుతున్నాడని కూడా చూడకుండా లెక్చరర్లు ప్రణీత్ను దాదాపు 40 నిమిషాల పాటు బయటే నిలబెట్టారు. తోటి విద్యార్థుల ముందు హాల్టికెట్ ఇవ్వకుండా అవమానించడంతో ప్రణీత్ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. నిన్న సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో అతను ఆత్మహత్య చేసుకున్నాడు. హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక విద్యార్థి పరిస్థితిని అర్థం చేసుకోకుండా ప్రాణం పోయేలా ప్రవర్తించిన కాలేజీ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రణీత్ కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
Also Read: గోదారమ్మ గుండెల్లో ‘మెటల్ రోడ్లు’.. మణుగూరులో ఇసుకాసురుల అరాచకం!