Hyderabad: హైదరాబాద్లో గుండెల్ని పిండేసే తీవ్ర విషాదకర ఘటన వెలుగుచూసింది. మియాపూర్ పరిధిలోని మయూరి నగర్లో నివసిస్తున్న ఈషా సాహు (37) అనే మహిళ.. తన ఆరు నెలల పసికందుతో కలిసి అపార్ట్మెంట్ ఆరో అంతస్తు నుంచి కిందకు దూకేసింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్రంగా రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే, అదృష్టవశాత్తూ ఆ చిన్నారి స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడింది. వెంటనే గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు పసిబిడ్డను ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
ఈ ఘోర ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈషా సాహుకు రెండో బిడ్డ పుట్టిన తర్వాత తీవ్రమైన మానసిక ఒత్తిడికి (పోస్ట్పార్టమ్ డిప్రెషన్కు) లోనైనట్లు తెలుస్తోంది. రెండో బిడ్డ పుట్టిన తర్వాత ఎదురైన మానసిక సవాళ్లను తట్టుకోలేక, తీవ్ర వేదనతోనే ఆమె ఈ అనాలోచిత నిర్ణయం తీసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
మానసిక ఒత్తిడి ఒక మనిషిని ఎంతటి దారుణమైన స్థితికి తీసుకెళ్తుందో చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం. పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఈ ఆత్మహత్యకు గల పూర్తి కారణాలపై అన్ని కోణాల్లోనూ ఆరా తీస్తున్నారు. పచ్చని సంసారంలో ఇలాంటి విషాదం నిండటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Also Read: భార్యతో వివాహేతర సంబంధం.. డ్రైవర్ను చంపి సిమెంట్ పైపులో దాచేసిన యజమాని!