Kadapa: కడప జిల్లాలో ఒక వివాహేతర సంబంధం ఘోర హత్యకు దారితీసింది. నమ్మకంగా పనిచేస్తున్న డ్రైవరే తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడనే కక్షతో, ఓ యజమాని అతడిని అత్యంత దారుణంగా మట్టుబెట్టాడు. ఈ కిరాతక ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
పోలీసుల సమాచారం ప్రకారం.. కడప నగరానికి చెందిన చింతం రామసుబ్బారెడ్డి వద్ద అక్కపల్లె వంశీ (25) అనే యువకుడు డ్రైవర్గా పనిచేసేవాడు. ఈ క్రమంలోనే రామసుబ్బారెడ్డి భార్యతో వంశీకి అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయం కాస్తా యజమానికి తెలియడంతో అతడు వంశీపై తీవ్ర కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అతడిని అంతమొందించాలని పథకం వేశాడు.
ప్లాన్ ప్రకారం.. మూడు రోజుల క్రితం వంశీని రామసుబ్బారెడ్డి హతమార్చాడు. అనంతరం ఎవరికీ దొరక్కుండా ఉండేందుకు మృతదేహాన్ని తన కారులోనే ఎక్కించుకుని ఒంటిమిట్ట పరిధిలోని సోమశిల వెనక జలాల ప్రాంతానికి తరలించాడు. అక్కడ ఉన్న ఒక సిమెంట్ పైపులో శవాన్ని దాచిపెట్టి ఏమీ తెలియనట్టు పరారయ్యాడు.
మరోవైపు వంశీ కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు మూడు రోజుల క్రితం కడప రిమ్స్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆధారాలతో దర్యాప్తు చేపట్టగా ఈ దారుణం వెలుగుచూసింది. ఒంటిమిట్ట వద్ద సిమెంట్ పైపులో ఉన్న వంశీ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భార్యతో ఉన్న అక్రమ సంబంధం వల్లే తానే వంశీని చంపి, కారులో తెచ్చి ఇక్కడ పడేసినట్లు నిందితుడు రామసుబ్బారెడ్డి పోలీసుల విచారణలో అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు.
Also Read: తెలంగాణ కాంగ్రెస్ సరికొత్త యాక్షన్ ప్లాన్.. రంగంలోకి బూత్ లెవల్ ఏజెంట్లు!