Operation Safe School: విద్యా సంస్థల వద్ద పొగాకు ఉత్పత్తులు అమ్ముతున్న వారిపై హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఆపరేషన్ సేఫ్ స్కూల్ జరిపి 567 కేసులు నమోదు చేశారు. అలాగే రూ. 1.10కోట్ల విలువ చేసే పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ వీ.సీ.సజ్జనార్ మాట్లాడుతూ విద్యార్థులకు మత్తు అలవాటు చేసి క్రమంగా వారు డ్రగ్స్ ఉచ్ఛులో చిక్కుకోవటానికి కారణమవుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలమని స్పష్టం చేశారు. ఇలాంటి వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
డ్రగ్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ను మార్చటానికే ఈ ఆపరేషన్ జరిపినట్టు సీపీ సజ్జనార్ తెలిపారు. ఇకపై కూడా దాడులు కొనసాగుతాయని పేర్కొన్నారు. సామాజిక బాధ్యతగా ప్రజలు ముఖ్యంగా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యా సంస్థల వద్ద పొగాకు ఉత్పత్తుల విక్రయాలకు చెక్ పెట్టేందుకు సహకరించాలని కోరారు. ఎక్కడైనా సిగరెట్లు, గుట్కాలు ఇతర పొగాకు ఉత్పత్తుల విక్రయాలు జరుగుతున్నట్టు తెలిస్తే వెంటనే డయల్ 100 కు కాల్ చేయాలని కోరారు. దాంతోపాటు 8712661601 హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ కు సమాచారం అందించాలన్నారు.
Also Read: BJP Criticism: రేవంత్, కేసీఆర్ ఒక్కటే.. తోడుదొంగలుగా మారారు.. బీజేపీ నేత సంచలనం
ఆపరేషన్ సేఫ్ స్కూల్ లో భాగంగా జరిపిన దాడుల్లో అత్యధికంగా చార్మినార్ జోన్ పరిధిలో 119 కేసులు నమోదయ్యాయి. ఆ తరువాతి స్థానంలో 102 కేసులతో రాజేంద్రనగర్ జోన్ నిలిచింది. గోల్కొండ జోన్ లో 98 కేసులు నమోదు కాగా.. ఖైరతాబాద్ జోన్ లో 78 కేసులు రిజిష్టరయ్యాయి. ఇక సికింద్రాబాద్ జోన్ లో 64, జూబ్లీహిల్స్ జోన్ లో 54, శంషాబాద్ జోన్ పరిధిలో 52 మంది దుకాణందారులపై కేసులు నమోదు చేశారు. వీరిపై పొగాకు ఉత్పత్తుల చట్టం, బీఎన్ఎస్ యాక్ట్ తోపాటు జువెనైల్ జస్టిస్ యాక్ట్ లోని వేర్వేరు సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు.
Also Read: కేసీఆర్ పర్యటనలో డ్రోన్ కలకలం.. భద్రతా లోపమా? ప్రైవేటు వ్యక్తుల పనా?