KCR Jagitial visit drone incident: జగిత్యాల జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా డ్రోన్ చక్కర్లు కొట్టడం భద్రతా పరమైన కలకలాన్ని రేపింది. కేసీఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ల్యాండ్ అవుతున్న సమయంలో, నిబంధనలకు విరుద్ధంగా గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ను ఎగురవేయడం అధికారులను ఉలిక్కిపడేలా చేసింది. ఈ ఘటనపై అప్రమత్తమైన పోలీసులు, సదరు డ్రోన్ను భద్రతలో భాగంగా పోలీసులే ఎగురవేశారా లేక ప్రైవేటు వ్యక్తులు ఎవరైనా అతిక్రమణకు పాల్పడ్డారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. నో-ఫ్లై జోన్ నిబంధనలను ఉల్లంఘించి డ్రోన్ ఎగురవేసిన వారిని గుర్తించే పనిలో నిఘా వర్గాలు నిమగ్నమయ్యాయి.
మరోవైపు, జగిత్యాల చేరుకున్న కేసీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన కీలక నేతలతో సమావేశమయ్యారు. స్థానిక బీఆర్ఎస్ భవన్ వేదికగా జరుగుతున్న ఈ భేటీలో ఉత్తర తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. సాగునీటి ఎద్దడి, పంట నష్టాలు, ప్రభుత్వం నుంచి అందాల్సిన సహాయం వంటి అంశాలపై క్షేత్రస్థాయి నివేదికలను అడిగి తెలుసుకుంటున్నారు. ఈ పర్యటన ద్వారా అటు ప్రజల్లోనూ, ఇటు పార్టీ శ్రేణుల్లోనూ భరోసా నింపేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు.
Read Also: ఏపీ సచివాలయ నేత వెంకట్రామిరెడ్డికి కోలుకోలేని దెబ్బ.. 14 ఏళ్ల సర్వీసు ఉండగానే వేటు!