ఏపీలో అధికారం పంచుకుంటున్న టీడీపీ, జనసేన మధ్య కొత్తగా పంచాయితీ నెలకొన్నది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నది. వచ్చే ఎన్నికల్లోనూ కలిస పోటీ చేస్తామని ఆ మధ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కానీ, అది ఆచరణలో సాధ్యం అవుతుందా? అంటే కాలమే దానికి సమాధానం చెప్పాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే పార్టీలు వేరైనా అధికారాన్ని మాత్రం పంచుకుంటున్నాయి. ప్రభుత్వ కార్యక్రమం ఏదైనా తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని అటు జనసేన, ఇటు టీడీపీ నేతల ఆరోపణలు పార్టీల మధ్య దూరాన్ని పెంచుతున్నట్టు ప్రచారం జరుగుతోంది.దీనికి తోడు ప్రతిపక్షం రొటోకూటమిలోని పార్టీల మధ్య మరింత వైషమ్యాలు పెంచేలా లోకల్ పాలిటిక్స్ చేస్తున్నట్టు తెలుస్తున్నది.
ఈ మధ్యకాలంలో టీడీపీ,జనసేన మధ్య ప్రొటోకాల్ పంచాయితీలు పెరిగిపోతున్నాయి. జిల్లాలు, నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాలు, సంక్షేమం అమలు, ప్రజలతో ఇంటరాక్షన్ సమయంలో స్థానికంగా ఉంటున్న తమకు సమాచారం ఇవ్వడం లేదని కొందరు నేతలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం ఇరు పార్టీల్లో వైరం పెంచుతోంది. ఒకానొక సమయంలో టీడీపీ, జనసేన నేతలు ఫైటింగ్ వరకు వెళ్తున్నారు. అది కాస్త ప్రతిపక్ష పార్టీకి ప్లస్ అవుతోంది. ఈ అంశంలో ఆ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పదవులు, పెత్తనం కోసం అధికార కూటమిలో కుమ్ములాటలు జరుగుతున్నాయని.. వీరు ప్రజా సమస్యలను ఏం పట్టించుకుంటారని స్థానిక, జిల్లా వైసీపీ నేతలు ప్రత్యేకంగా కార్నర్ చేస్తున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన, టీడీపీ నేతల మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఎస్వీఎస్ఎన్ వర్మను కొట్టేందుకు జనసేన నేత పెండెం దొరబాబు, ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు దూసుకెళ్లారు.అయితే, వారిని ఆ పార్టీ నేతలే అదుపుచేయడంతో వర్మకు దెబ్బలు తప్పాయని తెలుస్తున్నది. నిన్న పిఠాపురంలో డ్వాక్రా మహిళలకు సెల్ ఫోన్లు, ట్యాబ్లు పంపిణీ చేసేందుకు కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటో పెద్దదిగా ఏర్పాటు చేశారు. ఇక అదే ఫ్లెక్సీలో సీఎం చంద్రబాబు ఫొటో అస్సలు వాడలేదని వర్మతో పాటు ఇతర టీడీపీ నేతల వాదన.. సమస్య చిన్నదే అయినా ఇరు పార్టీల నేతల మధ్య సయోధ్య లేక గొడవ ముదిరిందని టాక్.
పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధమే.. నివేదికపై చర్యలొద్దన్న హైకోర్టు, కేసీఆర్-హరీష్రావులకు స్మాల్ రిలీఫ్
చంద్రబాబు రాష్ట్రానికి సీఎం.. కూటమికి పెద్ద. ఆయన నాయకత్వంలోనే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిందనేది కాదనలేదని సత్యం.అలాంటప్పుడు డిప్యూటీ సీఎం ఫొటో కంటే ముందు సీఎం ఫొటో ఉండాలని వర్మ వాదిస్తున్నారు. ఫ్లెక్సీలో ఫొటో ఎందుకు పెట్టలేదని అధికారులు, జనసేన నేతలను ప్రశ్నించారు. అదే సమయంలో పెండెం దొరబాబు ఆగ్రహంతో ఊగిపోయినట్టు తెలిసింది. చంద్రబాబు ఫొటో పెట్టం ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్టు ఆయన బదులిచ్చినట్టు సమాచారం. అంతేకాకుండా వర్మను కొట్టేందుకు యత్నించినట్టు సమాచారం. జనసేన నేతలు అడ్డుకోకపోతే వర్మ మీద దొరబాబు వర్గం దాడిచేసేదని తెలిసింది. ఇరువర్గాల మధ్య కాసేపు తోపులాట జరిగినట్టు సమాచారం. అయితే, దీనిని మరింత పెద్దగా చేయాలని ప్రతిపక్ష వైసీపీ కుట్ర రాజకీయాలకు తెరలేపిందని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.ఫొటో వివాదం ఎంతదూరం వెళ్తుందో అని పెద్దఎత్తున పిఠాపురం నియోజకవర్గంలో చర్చ జరుగుతున్నది.