Hyderabad: హైదరాబాద్లో మరోసారి నేపాలీ గ్యాంగ్ చేతివాటం ప్రదర్శించింది. గచ్చిబౌలిలోని ప్రముఖ హిల్ రిడ్జ్ విల్లాస్లో నివసించే ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. సుమారు ఒక కేజీ బంగారు ఆభరణాలు, కోట్లాది రూపాయల విలువైన వజ్రాలను దొంగలు దోచుకెళ్లారు.
ఈ దారుణానికి ఆ ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్న నేపాల్ దంపతులే ఒడిగట్టినట్లు పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. కేవలం నెల రోజుల క్రితమే సదరు వ్యాపారి వీరికి ఆశ్రయమిచ్చి పనిలో పెట్టుకున్నారు. అయితే, ఇటీవల వ్యాపారి తన కుటుంబంతో కలిసి ఒక శుభకార్యం నిమిత్తం ముంబయి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన ఆ దంపతులు ఇల్లంతా గుల్ల చేసి పరారయ్యారు.
బాధితులు ముంబయి నుంచి తిరిగి వచ్చేసరికి ఇల్లు గుల్లై ఉండటాన్ని చూసి షాక్కు గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, రంగంలోకి దిగిన గచ్చిబౌలి పోలీసులు క్లూస్ టీమ్తో కలిసి ఆధారాలు సేకరిస్తున్నారు. ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తూ నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నమ్మినవారే ఇలా ముంచేయడంతో స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
Also Read: ఆన్లైన్ బెట్టింగ్ మహమ్మారికి మరో బలి.. నూజివీడులో యువకుడి ఆత్మహత్య!