Student Suicide: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండల కేంద్రంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇందల్వాయిలోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలానికి చెందిన విద్యార్థిగా పోలీసులు గుర్తించారు.
పాఠశాల నిబంధనలకు విరుద్ధంగా సదరు విద్యార్థి తన వద్ద సెల్ ఫోన్ ఉంచుకున్నట్లు తెలిసింది. హాస్టల్ తనిఖీల్లో భాగంగా విద్యార్థి వద్ద మొబైల్ ఫోన్ ఉండటాన్ని గమనించిన ఉపాధ్యాయుడు అతడిని మందలించారు. చదువుకోవాల్సిన వయసులో ఫోన్లు ఎందుకని, క్రమశిక్షణతో ఉండాలని టీచర్ వారించినట్లు సమాచారం. అయితే, ఉపాధ్యాయుడి మందలింపును సదరు విద్యార్థి తీవ్రంగా పరిగణించి, తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
మనస్తాపం చెందిన విద్యార్థి తన గదిలో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తోటి విద్యార్థులు గమనించి పాఠశాల సిబ్బందికి సమాచారం అందించగా, వారు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. చదువుకుని ప్రయోజకుడు కావాల్సిన బాలుడు, చిన్న కారణానికే ప్రాణాలు తీసుకోవడం తోటి విద్యార్థులను, ఉపాధ్యాయులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read: సమాజమా.. ఎటు పోతున్నావు? సొంత చెల్లెలిపైనే కన్నేసిన కామాంధుడు!