ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ట్విట్టర్ కిల్లర్ కథ ముగిసింది. జపాన్ లో ఉరిశిక్షను రద్దు చేయాలంటూ డిమాండ్లు పెరుగుతున్న వేళ ఆ ట్విట్టర్ కిల్లర్ ని తాజాగా ఉరితీశారు. 2017లో ఈ ట్విట్టర్ కిల్లర్ 9మందిని హత్యచేశాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేసి, విచారణ జరిపారు. 2020లో కోర్టు అతడికి మరణ శిక్ష విధించింది. అయితే అప్పటినుంచి ఆ శిక్ష అమలు వాయిదా పడుతూ వచ్చింది. అసలు మరణ శిక్షనే రద్దు చేయాలంటూ జపాన్ లో ఉద్యమాలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ట్విట్టర్ కిల్లర్ కూడా బతికిపోతాడనే అనుకున్నారంతా. కానీ కొత్త ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంది. అతడిని ఉరి తీసింది. ఉరికి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్న తరుణంలో జపాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. జపాన్లో ప్రస్తుతం 105 మంది మరణశిక్ష విధింపబడిన ఖైదీలు ఉన్నారు. గత మూడేళ్లుగా అక్కడ ఉరిశిక్ష అమలు కావడం లేదు. గత అక్టోబర్లో ప్రధాన మంత్రి షిగేరు ఇషిబా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరణశిక్ష అమలు చేయడం ఇదే మొదటిసారి.
ట్విట్టర్ కిల్లర్..
వాడి పేరు తకాహిరో షిరైషిని. ట్విట్టర్ కిల్లర్ గా వాడు జపాన్ లో ఫేమస్. ఆ పేరు వెనక ఓ కథ ఉంది. వాడి బారినపడి ప్రాణాలు కోల్పోయిన అభాగ్యులంతా వాడికి ట్విట్టర్లో పరిచయమైనవారే. అలా వారిని పరిచయం చేసుకుని, తన అపార్ట్ మెంట్ కి పిలిపించుకుని లైంగిక దాడి చేసి అతి దారుణంగా చంపేశాడు. మొత్తం 9 మందిని వాడు చంపాడు. అందులో 8మంది యువతులు. యువతులపై లైంగిక దాడి చేసి, ఆ తర్వాత గొంతుకోసి, సాక్ష్యాలను మాయం చేయడానికి వారిని ముక్కలు ముక్కలుగా నరికేవాడు. ఆ ముక్కలన్నిటితో కలసి ఓసారి పోలీసులకు పట్టుబడ్డాడు, జైలుకెళ్లాడు.
ఎరవేసేవాడు..
సోషల్ మీడియాలో, ముఖ్యంగా ట్విట్టర్లో తకాహిరో షిరైషిని యాక్టివ్ గా ఉండేవాడు. ఎవరెవరు, ఎలాంటి పోస్టింగ్ లు పెడుతున్నారు, మెసేజ్ లకు ఎలా రియాక్ట్ అవుతున్నారనే విషయాలను గమనించేవాడు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలతో ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్న వారి బలహీనతను వీడు సొమ్ము చేసుకునేవాడు. వారికి సహాయం చేస్తానని నమ్మించేవాడు. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, తాను తోడుంటానని చెప్పేవాడు. అలా నమ్మకంగా వారికి దగ్గరై స్నేహం చేసేవాడు.
చివరకు తన రూమ్ కి పిలిపించుకుని వారిపై లైంగిక దాడి చేసేవాడు. ఆపై దారుణంగా హత్య చేసేవాడు. మృతులలో 8 మంది యువతులు, ఒక యువకుడు ఉన్నారు. బాధితురాళ్లలో ఒకరి బాయ్ఫ్రెండ్కు వీడి వికృతరూపం తెలియడంతో అతడిని కూడా ఆ అపార్ట్ మెంట్ కి పిలిచి చంపేశాడు. ఆ తర్వాత వీలు చూసుకుని సాక్ష్యాలను మాయం చేద్దామనుకున్నాడు. అంతలోనే పోలీసులకు చిక్కాడు. 2017లో షిరైషిని ఉంటున్న అపార్ట్మెంట్పై పోలీసులు దాడి చేయగా.. ఈ ఘోరం వెలుగు చూసింది. కోల్డ్-స్టోరేజ్ బాక్సుల్లో ముక్కలుగా నరికిన స్థితిలో ఉన్న 9 మంది మృతదేహాలను గుర్తించి అధికారులు షాక్ అయ్యారు. వెంటనే అతడిని అరెస్ట్ చేశారు. విచారణలో తాను చేసిన నేరాలన్నిటినీ ఒప్పుకున్నాడు షిరైషిని.