Electoral Roll: స్వేచ్ఛ బ్యూరో: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించాలని టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ).. రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా బీఎల్ఏలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఈ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న ఆయన, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు ఎలా పనిచేయాలో దిశా నిర్దేశం చేశారు.
బిఎల్ఓలతో సమన్వయం.. కీలక బాధ్యతలు
భారత ఎన్నికల సంఘం ఓటరు జాబితాలను పూర్తి పారదర్శకంగా, పక్కాగా రూపొందించేందుకు ఈ సవరణ కార్యక్రమాన్ని చేపట్టిందని సుధాకర్ గౌడ్ వివరించారు. ఈ ప్రక్రియలో బీఎల్ఏలు కేవలం వీక్షకులుగా కాకుండా, ప్రభుత్వ బూత్ లెవల్ అధికారులతో (బీఎల్ఓలు) నిరంతరం సమన్వయం చేసుకోవాలని సూచించారు. కొత్తగా 18 ఏళ్లు నిండిన యువతీ యువకులను ఓటర్లుగా నమోదు చేయడం, మరణించిన వారి పేర్లను జాబితా నుండి తొలగించడం, ఉపాధి లేదా ఇతర కారణాల వల్ల వలస వెళ్లిన వారి వివరాలను సవరించడం వంటి పనుల్లో బీఎల్ఏలు చురుకైన పాత్ర పోషించాలని స్పష్టం చేశారు.
లక్ష్యం.. అర్హులందరికీ ఓటు హక్కు
ప్రతి అర్హత కలిగిన పౌరుడికి ఓటు హక్కు కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. స్థానికంగా ఉండే ప్రతి ఒక్కరిని నిశితంగా పరిశీలించి, ఏ ఒక్క నిజమైన ఓటరు కూడా జాబితా నుంచి మినహాయించబడకుండా చూసుకోవాల్సిన బాధ్యత బీఎల్ఏలపైనే ఉందన్నారు. అనర్హుల ఓట్లను తొలగిస్తూ, అర్హులందరికీ జాబితాలో చోటు కల్పించినప్పుడే ప్రజాస్వామ్యానికి నిజమైన విలువ వస్తుందని, ఈ సవరణ కార్యక్రమాన్ని పార్టీ కార్యకర్తలు బాధ్యతాయుతంగా విజయవంతం చేయాలని బండి సుధాకర్ గౌడ్ పిలుపునిచ్చారు.
Also Read: హెల్త్ కార్డుల ఇష్యూపై వెనక్కి తగ్గేదే లేదు.. ప్రభుత్వానికి బీఆర్ఎస్ అల్టిమేటం!