Krishna River: పల్నాడు జిల్లాలోని కోనూరు గ్రామం వద్ద కృష్ణానదిలో జరిగిన పడవ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. విహారయాత్ర కోసం సరదాగా బయలుదేరిన పదిమంది బంధువుల కుటుంబంలో ఇప్పుడు తీవ్ర ఆందోళన నెలకొంది. పదిమంది కలిసి ఒక పడవలో నదిలోకి విహారయాత్రకు వెళ్లారు. అయితే, తిరిగి వస్తున్న సమయంలో పడవ ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడటంతో వారంతా నదిలో మునిగిపోయారు.
ఈ దుర్ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన స్థానికులు ప్రాణాలకు తెగించి నదిలోకి దూకారు. తమవంతు ప్రయత్నంతో ఆరుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ప్రమాదం జరిగిన సమయంలో నీటిలో మునిగిపోయిన మరో నలుగురిలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరి కోసం గజ ఈతగాళ్లు, స్థానికులు , పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఈ ఘటనతో కోనూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అధికారుల పర్యవేక్షణలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మునిగిపోయిన పడవ సాంకేతిక లోపంతో బోల్తా పడిందా లేక ప్రమాదవశాత్తు జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. సురక్షితంగా బయటపడిన ఆరుగురికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
also read: వర్షాకాలంలో ఏసీ వాడుతున్నారా? ఈ సెట్టింగ్స్ మారిస్తే కరెంట్ బిల్లు ఆదా, ఇల్లూ ప్రశాంతం!