Nandyal Road Accident: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీలు- ఓ ట్రావెల్ బస్సు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో స్పాటులో ఇద్దరు మృత్యువాతపడ్డారు. మరో డజను మందికి పైగానే గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటన సమయంలో బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.
ఆళ్లగడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం
అసలు రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది. శనివారం అర్ధరాత్రి తర్వాత ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి పాండిచ్చేరి వెళ్తోంది మైత్రి ట్రావెల్స్ కి చెందిన ఓ బస్సు. మొత్తం 33 మంది ప్రయాణికులతో బయలుదేరింది. అయితే బస్సు ఆళ్లగడ్డ సమీపంలోని పేరాయపల్లెమెట్ట ప్రాంతానికి చేరుకునేసరికి మొదట బస్సు డ్రైవరు.. ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీ కొట్టింది.
బస్సు వెనకాల వస్తున్న మరో లారీ ఈ బస్సుని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో బస్సు వెనుక భాగంలో కూర్చొన్న ఇద్దరు ప్రయాణికులు స్పాట్లో మృత్యువాత పడ్డారు. మరో డజను వరకు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను మూడు అంబులెన్సులో ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ట్రావెల్ బస్సు-రెండు లారీలు ఢీ, స్పాట్లో ఇద్దరు మృతి
బస్సులో వెనుక భాగంలో కూర్చొన్న ఇరుక్కుపోయిన ఇద్దరు ప్రయాణికుల మృతదేహాలను నానాకష్టపడి బయటకు తీశారు. లారీ డ్రైవరుని అతి కష్టం మీద బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో అన్నమయ్య జిల్లాలోని రాయచోటి ప్రాంతానికి చెందినవారు ఉన్నారు. వారిలో ఖాదర్వలి, అతడి భార్య ఆసిఫా, కడప జిల్లాలోని మిడ్తూరుకు చెందిన దొరస్వామి ఉన్నారు.
ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బస్సులను పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ ఘటనపై డీఎస్పీ ప్రమోద్ కీలక విషయాలు బయటపెట్టారు. ప్రయాణికులు మూత్ర విసర్జన కోసం బస్సును ఆపమని కోరడంతో బస్సు రోడ్డు పక్కన ఆగింది. ఆగి ఉన్న బస్సుని వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీ కొట్టిందని తెలిపారు.
ALSO READ: ప్రైవేటు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం, 8వ తరగతి విద్యార్థి మృతి
ప్రమాదంలో బస్సులోని బద్రీనాథ్, హరిత అనే ఇద్దరు ప్రయాణికులు మరణించారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఎస్పీ సునీల్ షేరాన్ ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
SP, DSPలు ఆసుపత్రికి చేరుకుని గాయపడిన వారిని కలిసి వివరాలు సేకరించారు. ఈ ఘటనలో మైత్రి ట్రావెల్స్ బస్సు ముందు-వెనుక భాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి. అర్ధరాత్రి జరిగిన ఈ ఘోర ప్రమాదం స్థానికుల్లో కలకలం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.