Madya pradesh Murder: మధ్యప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన కుటంబానికి చెందిన 8 మందిని కిరాతకంగా హత్య చేశాడు. అనంతరం తాను కూడా ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ కేసుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తామియా జనపద్ పంచాయితీ పరిధిలోని బోదల్ కచర్ గ్రామంలో బుధవారం ఈ ఘటన జరిగింది.
మధ్యప్రదేశ్లోని బోదల్ కచర్కు చెందిన ఓ యువకుడు తన కుటుంబంలోని 8 మందిని గొడ్డలితో నరికి హత్య చేశాడు. నిందితుడికి ఎనిమిది రోజుల క్రితమే వివాహం జరిగినట్లు తెలుస్తోంది. తన భార్యతో పాటు సోదరుడు, అతడి భార్యతో పాటు వారి ముగ్గురు పిల్లలు, తన తల్లిని కూడా అతికిరాతకంగా యువకుడు నరికి చంపాడు. ఎనిమిది మంది నిద్రిస్తున్న సమయంలో వారిని హత్య చేసినట్లు తెలుస్తోంది.
అనంతరం నిందితుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసలు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై అతడి చిన్నాన్న మాట్లాడుతూ.. దినేష్ ఏడాది నుంచి మానసిక సమస్యతో బాధపడుతున్నాడని.. ఇటీవల అతడికి చికిత్స కూడా అందించామని వెల్లడించారు. అంతే కాకుండా అతడికి మే 21న వివాహం జరిగినట్లు తెలిపారు.
Also Read: బార్లో వాగ్వాదం.. వ్యక్తిని కాల్చి చంపిన దుండగుడు!
పెళ్లి అయిన తర్వాత మరో సారి అతడికి మానసిక సమస్యలు మొదలయ్యాయని తెలిపారు. ఈ క్రమంలోనే అతడు హత్యకు పాల్పడినట్లు చెప్పారు. వారిని హత్య చేస్తున్న సమయంలో తమ కుటుంబానికి చెందిన ఓ మహిళ అతడిని చూసిందని అన్నారు. ఆమె గట్టిగా అరవడంతో ఆమె కుమారుడిపై కూడా దాడి చేసినట్లు వెల్లడించారు. అనంతరం అక్కడి నుంచి పారి పోయి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు.