Mancherial: మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని ఎల్లక్కపేట గ్రామంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. చల్ల రమేష్ అనే వ్యక్తి తన భార్య శారద (24)ను తన మిత్రుడి సహాయంతో సుత్తితో తలపై మోది కిరాతకంగా హత్య చేశాడు. మృతురాలికి మూడేళ్ల బాబుతో పాటు, కేవలం నాలుగు నెలల పసికందు కూడా ఉన్నాడు. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన అనంతరం నిందితులు ఇద్దరూ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు శారద మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ప్రమాదం వినగానే శారద కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహావేశాలతో పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. నిందితుడు రమేష్ను వెంటనే తమకు అప్పగించాలంటూ వారు గొడవకు దిగారు. ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుని, ఆగ్రహించిన బంధువులు పోలీస్ స్టేషన్పై రాళ్లదాడికి పాల్పడ్డారు. అక్కడ విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ సంపత్, ఏఎస్ఐ మజీద్లపై కూడా దాడి చేశారు. పోలీసులకు, శారద కుటుంబ సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, హత్యకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read: ఒక్కటే బిల్డింగ్.. ఊరంతా అందులోనే, ఇక్కడి ప్రజలకు బాహ్య ప్రపంచమే తెలియదట!