Medchal: స్వేచ్ఛ బ్యూరో: చైన్ స్నాచింగ్కు పాల్పడిన వ్యక్తిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముమ్మర దర్యాప్తు అనంతరం మహిళ మెడలోని మంగళసూత్రం లాక్కెళ్లిన ఇద్దరు నిందితులను గుర్తించి, వారిలో ఒకరిని చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శుక్రవారం ఏసీపీ శంకర్ రెడ్డి మేడ్చల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
మాస్క్ ధరించిన దుండగులు దాడి
మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునీరాబాద్లో ఉన్న రత్నదీప్ కంపెనీలో పనిచేస్తున్న పాతూరి శోభారాణి, అట్వెల్లి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. గత నెల 23వ తేదీన రాత్రి 7 గంటల సమయంలో విధులు ముగించుకుని, కోర్టు సమీపంలోని హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద కంపెనీ బస్సు నుంచి దిగారు. అక్కడి నుంచి మైల్స్టోన్ వెంచర్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా, కల్వర్టు వద్ద బైక్పై ముఖాలకు మాస్కులు ధరించి వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను అడ్డగించారు.
చైన్ దోపిడీ.. ఇద్దరు దుండగుల అరెస్ట్
వారిలో ఒకరు శోభారాణితో మాట్లాడుతుండగా.. మరొకరు ఆమె మెడలో ఉన్న బంగారు మంగళసూత్రం చైన్ను లాక్కొన్నారు. చైన్ తెగిపోగానే ఇద్దరూ బైక్పై పరారయ్యారు. అదే రోజు రాత్రి 2 గంటల సమయంలో బాధితురాలు మేడ్చల్ పోలీస్ స్టేషన్కు వెళ్లి, సుమారు అర తులం బంగారు మంగళసూత్రం చైన్ను గుర్తు తెలియని వ్యక్తులు లాక్కెళ్లినట్లు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సీఐ సత్యనారాయణ, డీసీపీ కోటి రెడ్డి, ఏసీపీ శంకర్ రెడ్డి మార్గదర్శకత్వంలో దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అనంతరం శంషార్ సింగ్, రూప్ సింగ్ చతూర్ సింగ్ (31)లు ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.
రిమాండ్కు తరలింపు
ఈ కేసులో ఏ-2 నిందితుడిగా ఉన్న రూప్ సింగ్పై కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా గాంధీగంజ్ పోలీస్ స్టేషన్లో కూడా గతంలో ఒక కేసు నమోదై ఉంది. నిందితుల కోసం కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా మహారాష్ట్రకు చెందిన రూప్ సింగ్, జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీనగర్లో నివాసం ఉంటూ స్క్రాప్ దుకాణంలో పనిచేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు.నిందితుడి వద్ద నుంచి బైక్, ఒక సెల్ఫోన్, బంగారు చైన్ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్కు తరలించారు.ఈ సమావేశంలో సీఐ సత్యనారాయణ, డీఐ కిరణ్తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Also Read: ఛత్తీస్గఢ్ సీఎంతో మంత్రి ఉత్తమ్ భేటీ.. సమ్మక్క-సారక్క ప్రాజెక్టుపై చర్చ