పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుణెకి చెందిన బాధితురాలికి (62) ఇటీవల ‘డేటా ప్రొటెక్షన్ ఏజెన్సీ’ ప్రతినిధిగా పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఆమె ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్ను మోసపూరిత లావాదేవీల కోసం దుర్వినియోగం చేశారని, తీవ్రమైన కేసులో ఇరుక్కున్నారని నమ్మబలికాడు.
బాధితురాలు ఆందోళన చెందుతున్న సమయంలోనే, ‘జార్జ్ మాథ్యూ’ అనే సీనియర్ పోలీసు అధికారిగా మరో వ్యక్తి వీడియో కాల్ చేశాడు. ఆమెపై మనీలాండరింగ్ కేసు నమోదు చేశామని, వెంటనే బ్యాంకు ఖాతాలన్నీ స్తంభింపజేస్తామని హెచ్చరించాడు. ఈ నేరాలకు గాను ఏకంగా కేంద్ర ఆర్థిక శాఖ నుంచి అరెస్ట్ వారెంట్ జారీ అయిందంటూ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నకిలీ సంతకం (Nirmala Sitharaman’s signature dupe) ఉన్న వారెంట్ను వాట్సాప్లో పంపాడు.
Read Also: Telegram:టెలిగ్రామ్పై భారత ప్రభుత్వం ఉక్కుపాదం.. అక్రమాలకు అడ్డాగా మారిందన్న ఆరోపణలపై దర్యాప్తు!
అక్రమ కార్యకలాపాలకు పాల్పడినందుకు ఆమెను ‘డిజిటల్ అరెస్ట్’ చేశామని, దర్యాప్తు అధికారి నిఘాలో ఉండాలని, వాట్సాప్ కాల్ను అస్సలు కట్ చేయకూడదని షరతు విధించాడు. ఈ కేసు నుంచి బయటపడాలంటే, ధ్రువీకరణ కోసం తన వద్ద ఉన్న నిధులన్నింటినీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఖాతాలకు బదిలీ చేయాలని ఆదేశించాడు. శిక్ష పడుతుందన్న భయంతో ఆందోళన చెందిన ఆ వృద్ధురాలు, నేరగాళ్లు చెప్పినట్లుగా వివిధ ఖాతాలకు విడతలవారీగా రూ. 99 లక్షలు బదిలీ చేసింది.
డబ్బు మొత్తం బదిలీ అయ్యాక, నిందితుడి నంబర్ స్విచ్ ఆఫ్ రావడంతో తాను మోసపోయానని గ్రహించి, బాధితురాలు పుణె సిటీ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు, డబ్బు బదిలీ అయిన బ్యాంకు ఖాతాలను గుర్తించి, వాటిని స్తంభింపజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.