దేశ వ్యాప్తంగా రైల్వే ప్రమాదాల్లో నిత్యం ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటారు. అలాగే గత 15 ఏళ్లుగా ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలోని రైల్వే లైన్లలో వేలాది మంది చనిపోగా, వారిలో గుర్తించని మృతదేహాలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఆర్టీఐ ప్రశ్నకు సమాధానంగా రైల్వే ప్రమాద మృతులు, గుర్తు తెలియని మృతదేహాల వివరాలను వెల్లడించారు.
15 ఏళ్లలో 46 వేల మంది మృతి
ముంబై సబర్బన్ నెట్ వర్క్ పరిధిలో జరిగిన రైలు ప్రమాదాల్లో మొత్తం 46,969 మంది చనిపోయినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. వారిలో 31% మంది అంటే 14,513 మృతదేహాలు ఎవరివి అనే విషయం ఇప్పటికీ గుర్తించలేదని తెలిపారు. ప్రభుత్వ రైల్వే పోలీసులు ఆ డెడ్ బాడీస్ వివరాల కోసం ప్రయత్నించినప్పటికీ, గుర్తించలేకపోయినట్లు వెల్లడించారు. అందుకే వారి బంధువులకు వాటిని అప్పగించలేదన్నారు. ఆర్థోపెడిక్ డాక్టర్ సరోష్ మెహతా ఆర్టీఐ పిటిషన్ ద్వారా పొందిన డేటా ప్రకారం, 2019 నుంచి క్లెయిమ్ చేయని మృతదేహాల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తేలింది. రైల్వే ప్రమాద బాధితేల గుర్తింపును నిర్ధారించడం సవాలుతో కూడుకున్న వ్యవహారం అని పోలీసులు తెలిపారు. కొన్నిసార్లు మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా చిద్రం అవుతాయని, ఫోన్లు, గుర్తింపు కార్డులు లేకపోవడం వల్ల వాటిని గుర్తించడం కష్టం అవుతుందని రైల్వే అధికారులు తెలిపారు.
షోధ్ వెబ్ సైట్ ద్వారా గుర్తు తెలియని మృదేహాల వెల్లడి!
గతంలో గవర్నమెంట్ రైల్వే పోలీసులు షోధ్ అనే వెబ్ సైట్ నిర్వహించేవాళ్లు. అక్కడ గుర్తు తెలియని మృతదేహాల ఫోటోలతో పాటు వివరాలను పొందు పరిచేవాళ్లు. వారి కుటుంబాలు మృతదేహాలను గుర్తించేలాసాయపడేవారు. కానీ, ఇప్పుడు ఆ వెబ్ సైట్ ను నిర్వహించడం లేదు. ప్రమాద బాధితుల ఫోటోలతో కూడిన బ్యానర్లను రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేసి విరాలు తెలియజేయాలనే ప్రచారం మొదలుపెట్టారు. కానీ, ప్రయాణీకులు ఆ బ్యానర్లు ఇబ్బంది కరంగా ఉన్నాయని ఫిర్యాదులు చేయడంతో వాటిని తొలగించారు.
నెల రోజుల వరకు మార్చురీలో మృతదేహాలు
సాధారణంగా రైల్వే ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి గుర్తింపు తెలియనప్పుడు, మృతదేహాన్ని 15 రోజుల నుంచి ఒక నెల వరకు మార్చురీలో ఉంచుతారు. బాధితుడి ఫోటోను మెట్రోపాలిటన్ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లకు పంపి, ఎవరైనా తప్పిపోయినట్లు ఫిర్యాదులు అందాయేమో చెక్ చేస్తారు. ఒకవేళ నెల రోజుల్లో ఎవరూ రాకపోతే ఆ మృతదేహాన్ని దహనం చేస్తారు. అయితే, కొన్నిసార్లు మృతదేహాలు ఎక్కువ కావడం వల్ల నెల రోజులు కాకముందే దహన సంస్కారాలు నిర్వహించనున్నట్లు మార్చురీ వైద్యులు తెలిపారు.
ఇక 2002 నుంచి 2024 వరకు సుమారు 72,000 మందికి పైగా వివిధ కారణాల వల్ల రైల్వే లైన్లపై ప్రాణాలు కోల్పోయినట్లు రైల్వే అధికారులు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది ట్రాక్లు దాటుతుండగా ప్రమాదవశాత్తు మరణించారని తెలిపారు. ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు రైల్వేలు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. కానీ, ఇప్పటి మరణాల సంఖ్య తగ్గడం లేదంటున్నారు. మొత్తంగా ‘ఏజెంట్ సాయి సూర్య ఆత్రేయ’ మూవీలో కొన్ని గుర్తుతెలియని శవాలు రైల్వే ట్రాక్ల మీద ఉంటాయి. ఆ తరహా లోనే ముంబైలో కూడా గుర్తు తెలియని శవాలు కనిపిస్తున్నాయంటున్నారు రైల్వే అధికారులు.