Kalwakurthy Tragedy: నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామంలోని ఒక నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. సెలవుల నిమిత్తం హైదరాబాద్ నుండి తమ సొంత గ్రామానికి వచ్చిన ఈ విద్యార్థులు, పొలం వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ప్రమాదం జరిగిన తీరు: స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నారులు పొలం వద్ద ఆడుకుంటుండగా ఒకరు ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడిపోయారు. ఆ ఒక్కరిని కాపాడబోయే క్రమంలో మిగిలిన ఇద్దరు కూడా నీటిలో దిగి ఊబిలో చిక్కుకుపోయారు. ఈ హఠాత్పరిణామంతో ముగ్గురూ నీటిలో మునిగి అక్కడికక్కడే మరణించారు. మృతి చెందిన వారిలో ముచ్చర్లపల్లికి చెందిన సిరి (14), శ్రీమన్యు (14) మరియు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలకు చెందిన స్నేహ (15) ఉన్నారు.
సమాచారం అందుకున్న గ్రామస్తులు మరియు కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. ఒకేసారి ముగ్గురు చిన్నారులు మృతి చెందడంతో ముచ్చర్లపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ కళ్లముందే ఆడుకుంటూ కనిపించిన పిల్లలు శవాలుగా మారడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. VIDEO
Read Also: BRS Party: బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం.. ఆ ఛానల్ బహిష్కరణ, అసలు కారణం అదే