Gurrampode: స్వేఛ్చ బ్యూరో: రైతు నుంచి 20 వేలు లంచం తీసుకుంటూ నల్గొండ జిల్లా గుర్రంపోడ్ (ఆర్ ఐ)మహమ్మద్ అబ్దుల్ హకీం సోమవారం నల్గొండ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. ఏసీబీ నల్గొండ రేంజ్ ఆఫీసర్ జగదీష్ చంద్ర మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లా గుర్రంపూడ్ మండలం ఊట్లపల్లి గ్రామానికి చెందిన షేక్ గోరెమియా అనే రైతుకు గ్రామంలో తనకు తన కుటుంబ సభ్యులకు పేరిట 7 ఎకరాల భూమి ఉంది. అందులో 1.15 ఎకరాల భూమి మరొకరిపై పట్టా కాగా పరిశీలించి ఆ భూమిని తిరిగి తనపై ఆన్ లైన్ లో నమోదు చేయాలని ఇటీవల రైతు గోరెమియా గుర్రంపోడు తహాసీల్దార్ కరుణ శ్రీకి అప్లికేషన్ పెట్టుకున్నారు. దీంతో సదరు తహాసీల్దార్ రైతుకు సంబంధించిన ఫైల్ను ఎంక్వయిరీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆర్ఐ హాకీమ్ కు సూచించారు.
భూమి పట్టా విషయం పై రైతు గోరెమియా ఆర్ ఐ హకీమ్ వద్దకు వెళ్లాడు. రూ. 50 వేలు లంచం ఇస్తే పనిని పూర్తి చేస్తానని చెప్పాడు. ఇందుకు రైతు రూ. 30 వేలకు తన పని పూర్తి చేయాలని కోరాడు. మిగిలిన రూ. 20 వేలు కూడా ఇవ్వాలని అబ్దుల్ హకీం డిమాండ్ చేయడంతో రైతు గత నెలలో నల్గొండ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బాధితుని ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఏసీబీ అధికారులు తమ వద్ద ఉన్న రూ. 20 వేల నగదును రైతుకు ఇచ్చారు.
Also Read: Karma: కనిపించని మన కర్మలకు 18 మంది సాక్షులు గా ఉంటారట – ఆ 18 మంది ఎవరో తెలుసా..?
నగదును తీసుకొని రైతు మధ్యాహ్నం 1 గంట సమయంలో గుర్రంపోడ్ తహాసిల్దార్ కార్యాలయంలో ఉన్న ఆర్ ఐ హాకీమ్ కు ఇచ్చాడు. రైతు ఇచ్చిన నగదును ఆర్ ఐ తన జేబులో పెట్టుకోగా, ఏసీబీ ఇన్స్ స్పెక్టర్ జగదీష్ చందర్ ఆధ్వర్యంలో అధికారులు వెంటనే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి ఆర్ ఐ ని కస్టడీల్లోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఏసీబీ అధికారులు ఆయన్ని కార్యాలయంలో విచారించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీబీ నల్గొండ రేంజ్ ఆఫీసర్ జగదీష్ చందర్ మీడియాతో మాట్లాడుతూ భూమి పట్టా మార్పిడి విషయంలో రైతు నుంచి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఆర్ఐ హకీమ్ ను మంగళవారం నల్గొండ ఫస్ట్ అడిషనల్ మున్సిపాల్ జడ్జి కోర్టులో హాజరు పరచనున్నట్లు చెప్పారు.
Also Read: Box Office War: విజయ్ ‘జన నాయగన్’ టు యష్ ‘టాక్సిక్’ వరకు.. షెడ్యూల్ ఖరారు!