Tirumala Temple: ఒక రోజంతా తిరుమల ఆలయం మూతపడనుంది. ఎటువంటి దర్శనాలు ఆరోజు ఉండవు. అసలు దర్శన టోకెన్స్ కూడా ముందు రోజు ఆపేస్తారు. ఎందుకు తిరుమల ఆలయం మూత పడనుంది. ఎప్పుడు దర్శనాలు ఆపేస్తారు లాంటి పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి రోజుకు వేల మంది భక్తులు వెళ్తుంటారు. ఆయన సన్నిధిలో ఒక రోజు గడిపినా చాలు వేల జన్మల పుణ్యం లభిస్తుందని నమ్ముతుంటారు. అయితే అలాంటి తిరుమల శ్రీవారి ఆలయం ఒక రోజు మూతపడనుంది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక గంట కూడా మూత పడని ఆలయం దాదాపు ఒక పగలు మొత్తం క్లోజ్ కానుంది. ఆ సమయంలో స్వామి వారి ఎలాంటి దర్శనాలు కానీ సేవలు కానీ జరగవని ఆలయ అధికారులు తెలిపారు. ఆఖరికి గుడి దగ్గర ఎలాంటి దైవ కార్యక్రమాలు కూడా జరగవని తెలిపారు. అయితే గుడి ఎప్పుడు మూసి వేస్తారు. ఎందుకు మూసి వేస్తారు.. మళ్లీ ఎప్పుడు తెరుస్తారు అనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ సంవత్సరం అంటే 2026లో మొదటి గ్రహణ మార్చి మూడో తారీఖు రానుంది. ఆ రోజు చంద్ర గ్రహణం కారణంగా శ్రీవారి ఆలయాన్ని ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఏడున్నర గంటల వరకు అంటే సుమారు పదకొండు గంగల పాటు ఆలయాన్ని మూసి వేయనున్నారు. మార్చి 3వ తేదీ సాయంత్రం 3 గంటల 20 నిమిషాలకు చంద్ర గ్రహణం ప్రారంభమవుతుంది. తర్వాత సాయంత్రం 6 గంటల 47 నిమిషాకలు గ్రహణం పూర్తవుతుంది. సాధారణంగా గ్రహణ సమయానికి 6 గంటల ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీ. గ్రహణం తర్వాత అంటే సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. తర్వాత భక్తులకు శ్రీవారి దర్శనం రాత్రి 8 గంటల 30 నిమిషాలకు పునః ప్రారంభిస్తారు.
చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీ మంగళవారం అష్టదళ పాద పద్మారాధన సేవను, కళ్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు రద్దు చేసింది. వీటితో పాటు ఆరోజున వీఐపీ బ్రేక్ దర్శనాలు, శ్రీవాణి దర్శనాలు, 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులు, దాతలు, ఎన్ఆర్ఐ దర్శనాలను కూడా రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
సాధారణ భక్తులకు మరియు శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్తున్న భక్తులకు.. తిరుపతిలో శ్రీనివాసం, విష్ణు నివాసం, అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఇచ్చే ఎస్ ఎస్ డీ టోకెన్స్, దివ్య దర్శనం టోకెన్స్ కూడా ముందు రోజే ఆపివేస్తున్నట్టు తెలిపారు. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాలను గమనించి తమ తిరుమల యాత్ర ప్రణాళికను రూపొందించుకోవాల్సిందిగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అధికారులు సూచించారు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.