నంద్యాలలో ఓ మహిళ సెల్ఫీ వీడియో తీసుకుని, పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. సెల్ఫీ వీడియో తీసి తమ బాధను వివరించిన ఆమె.. తన భర్త షమీమ్ను ఓ కేసులో బయటకు తీసుకొస్తానని హుస్సేన్ అనే వ్యక్తి రూ.5 లక్షలు తీసుకుని మోసం చేశాడని ఆరోపించింది. హుస్సేన్కు పోలీసులు సహకరిస్తున్నారని.. తమ ఫిర్యాదును పట్టించుకోకపోవడంతో.. సీఐని ఆశ్రయించగానే తనపై దుర్భాషలాడారని బాధితురాలు వీడియోలో తెలిపింది.
ఈ సంఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళ ఆవేశంలో ఫినాయిల్ తాగడంతో కుటుంబ సభ్యులు వెంటనే నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతుండగా, ఆరోగ్య పరిస్థితి క్షీణంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ సంఘటనపై బాధిత మహిళ కుటుంబ సభ్యులు స్పందించారు. తమపై జరుగుతున్న అన్యాయాన్ని అధికారులు గమనించి న్యాయం చేయడంతో పాటు సీఐపై తగిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. అధికారులు కేసును దర్యాప్తుకు తీసుకుని వాస్తవాలను వెలికితీయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.