ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందంటూ వస్తున్న వార్తలపై జాతీయ మహిళా కమిషన్ (NCW) క్లారిటీ ఇచ్చింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో.. కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందించిన మహిళా కమిషన్, నిజా నిజాలను తేల్చేందుకు ప్రత్యేక విచారణ కమిటీని రంగంలోకి దించిన సంగతి తెలిసిందే.
క్షేత్రస్థాయిలో విచారణ..
మహిళా కమిషన్ సభ్యులు డెలినా, కంచన్ కట్టర్ నేతృత్వంలోని ఎంక్వయిరీ బృందం గురువారం మధ్యాహ్నం ములుగు జిల్లాకు చేరుకుంది. ఈ బృందం మొదటగా ములుగు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ దివాకర, ఎస్పీ రామ్ నాథ్ కేకన్, ఇతర ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా భేటీ అయ్యింది. ఘటనకు సంబంధించిన వివరాలను, పోలీసులు ఇప్పటివరకు సేకరించిన ఆధారాలను అధికారులు కమిషన్ సభ్యులకు వివరించారు. అనంతరం, ఘటన జరిగినట్లుగా ప్రచారంలో ఉన్న మేడారం జాతర పరిసర ప్రాంతాలను కమిటీ స్వయంగా పరిశీలించింది.
ఆరోపణల్లో వాస్తవం లేదు
విచారణ అనంతరం కమిషన్ సభ్యులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. మేడారం జాతరలో మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు ఆధారాలేవీ లభించలేదని, అసలు అటువంటి ఘటన జరగలేదని విచారణ బృందం స్పష్టం చేసింది. బాధితురాలిగా భావిస్తున్న వ్యక్తికి సంబంధించిన వివరాలు గానీ.. ఘటనకు సంబంధించి ఎలాంటి ప్రత్యక్ష సాక్ష్యాలు గానీ లేవని కమిటీ గుర్తించింది. ఈ ఆరోపణలు కేవలం అపోహలు లేదా తప్పుడు ప్రచారంగానే ఉన్నాయని అభిప్రాయపడింది.
పోలీసు శాఖ నుండి పూర్తిస్థాయి లిఖితపూర్వక నివేదిక అందిన తర్వాత, ఎంక్వయిరీ బృందం తన తుది నివేదికను జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్కు సమర్పించనుంది. జాతర వంటి పవిత్రమైన, భారీ జనసందోహం ఉండే చోట ఇటువంటి ప్రచారాలు భయాందోళనలకు గురిచేస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఏది ఏమైనా మహిళా కమిషన్ ప్రకటనతో గత కొద్ది రోజులుగా మేడారం జాతర పేరుతో సాగుతున్న ఈ గందరగోళానికి తెరపడినట్లయింది.